Begin typing your search above and press return to search.

వరద వేళ.. తమిళనాడు సీఎం హైదరాబాద్ కు అంత సాయం చేశారట

By:  Tupaki Desk   |   20 Oct 2020 6:45 AM GMT
వరద వేళ.. తమిళనాడు సీఎం హైదరాబాద్ కు అంత సాయం చేశారట
X
విపత్తు విరుచుకుపడిన వేళ.. తమకు తోచిన సాయాన్ని ఎవరికి వారు చేస్తుంటారు. చేసింది పిడికెడు అయినా చెప్పుకునే మాటలు మాత్రం భారీగా ఉంటాయి. అందుకు భిన్నంగా మూడో కంటికి తెలీకుండా సాయం చేసే పెద్ద మనుసులు చాలానే ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ నుభారీగా ముంచెత్తిన భారీ వర్షాలు..ఆ కారణంగా చోటు చేసుకున్న వరదలతో హైదరాబాద్ నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటివేళ.. బాధితులకు సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది.

వరదల కారణంగా దారుణంగా దెబ్బతిన్న వేలాది కుటుంబాలకు సాయం చేసేందుకు కిట్లను అందించారు. అంతేకాదు.. దుప్పట్లు భారీగా పంపిణీ చేశారు. అయితే.. ఈ దుప్పట్లను తమిళనాడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వానికి పంపారట. హైదరాబాద్ లోని దారుణ పరిస్థితిని గుర్తించిన ఆయన తనకు తాను స్పందించి.. తమ ప్రభుత్వం తరపు నుంచి పెద్ద ఎత్తున దుప్పట్లను హైదరాబాద్ కు పంపారట.

కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలీదన్నట్లుగా.. ఇంత సాయాన్ని చేసి కూడా ఎక్కడా తమ ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు సాయం చేసిందన్న మాటను చెప్పని వైనం చూస్తే.. తమిళ సీఎంను మెచ్చుకోకుండా ఉండలేం. ఇదిలా ఉంటే..హైదరాబాద్ లో చోటుచేసుకున్న వరదల నేపథ్యంలో బస్తీల నుంచి నిరాశ్రయులను తరలించేందుకు జీహెచ్ఎంసీ వద్ద కేవలం 15 బోట్లు మాత్రమే ఉన్నాయి.

రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ.. కర్ణాటక రాష్ట్రాల నుంచి పదిహేను చొప్పున బోట్లు రానున్నాయి. మొత్తంగా 50 బోట్లను అదనంగా సమకూర్చుకోనున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికి జరిగిన నష్టం జరిగినా.. రానున్న మూడు రోజుల్లో కురిసే భారీ వర్షాలకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి కేటీఆర్ చెబుతున్నారు.