Begin typing your search above and press return to search.

బీజేపీకి దిమ్మ తిరిగేలా షాకిచ్చిన కేసీఆర్ అండ్ కో

By:  Tupaki Desk   |   28 Jun 2022 3:07 AM GMT
బీజేపీకి దిమ్మ తిరిగేలా షాకిచ్చిన కేసీఆర్ అండ్ కో
X
గులాబీ బాస్ ఆలోచనలు ఎంత లోతుగా.. మరెంత దూరపు చూపుతో ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆ తీరు ఎలాంటిదన్న విషయాన్ని చెప్పే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. వచ్చే నెల రెండు.. మూడు తారీఖుల్లో జరిగే ఈ భారీ సమావేశానికి భారతీయ జనతా పార్టీ మొత్తం హైదరాబాద్ కు తరలిరానున్న సంగతి తెలిసిందే.

ఈ సమావేశాల్లో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పది లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం.. దీనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. తెలంగాణ బీజేపీతో పాటు.. జాతీయ పార్టీకి చెందిన పలువురు హైదరాబాద్ లో మకాం వేసి మరీ.. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మరో ఏడాది వ్యవధిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏది ఏమైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు సన్నాహాకంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్ని భారీ ఎత్తున నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.

ఇంత పెద్ద ఎత్తున సమావేశాల్ని నిర్వహిస్తున్నవేళలో.. దానికి సంబంధించిన ప్రచారం అంతే భారీగా చేయటం మామూలే. దీని కోసం మెట్రో ఫిల్లర్లతో పాటు.. ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ ఎత్తున హోర్డింగులు.. ప్రచార చిత్రాల్ని ప్రదర్శించేందుకు వీలుగా బీజేపీ ప్లాన్ చేసింది. ఇలాంటి వాటి విషయంలో మిగిలిన వారికంటే చురుగ్గా ఆలోచించే టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కమలనాథులకు షాకిచ్చినట్లుగా చెబుతున్నారు.

మెట్రో పిల్లర్లకు బీజేపీ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా కమలనాథులు సదరు యాడ్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే.. గులాబీ బాస్ ఆర్డర్ తో పది రోజుల పాటు (బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తి అయ్యే వరకు) మెట్రో పిల్లర్లతో సహా.. కీలక స్థానాల్లో ప్రచారానికి సంబంధించిన ఒప్పందాల్ని చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గులాబీ బాస్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తెలంగాణ బీజేపీ నేతలు కంగుతిన్నట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పలు పత్రికలకు సంబంధించిన జాకెట్ యాడ్ ల కోసం కేసీఆర్ సర్కారు పలు మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకుందని.. దీంతో.. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన ప్రచారం జోరుగా సాగకుండా ఎత్తులు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. మోడీ అండ్ కోకు గులాబీ బాస్ భారీ షాకిచ్చినట్లుగా చెప్పకతప్పదు.