Begin typing your search above and press return to search.

తెలంగాణ ఆపిల్: కేసీఆర్ కే స్ఫూర్తినిచ్చిన రైతు

By:  Tupaki Desk   |   26 May 2020 2:30 PM GMT
తెలంగాణ ఆపిల్: కేసీఆర్ కే స్ఫూర్తినిచ్చిన రైతు
X
తెలంగాణ సిఎం కేసీఆర్ రాష్ట్రంలో విభిన్న పంటలు పండేలా.. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా వినూత్న పంటల సాగుకు ఈ వానాకాలం నుంచి ప్లాన్ చేస్తున్నారు. కొత్త రకాలు.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని తలపోస్తున్నారు. ఏమి పండించాలనే దానిపై రైతులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

కాగా ఇలాంటి వినూత్న పంటలతో అలరిస్తున్నారు ఆసిఫాబాద్‌కు చెందిన గిరిజన రైతు బాలాజీ. ఇతడి గురించి కేసీఆర్ దృష్టికి వచ్చింది. జిల్లాలోని కేరమెరి మండలంలోని ధనోరా గ్రామంలో ఉన్న ఈ రైతు తన పొలంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆపిల్ ను పండించాడు

2017లో ఉత్తమ రైతు అవార్డు విజేతగా నిలిచిన బాలాజీ నాలుగేళ్ల నుంచి ఆపిల్ పండ్ల పెంపకం ప్రారంభించారు. ఆపిల్ పంట కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చల్లని ఉష్ణోగ్రతలలో మాత్రమే పండించవచ్చనే అపోహను ఈ రైతు ఛేదించాడు. హిమాచల్ ప్రదేశ్ లో రకరకాల ఆపిల్స్ ను 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సాగు చేస్తున్నారని తెలుసుకున్నారు. అతను హెచ్ఆర్ -99 రకానికి చెందిన 10 మొక్కలను కొని సాగు చేయడం ఆరంభించాడు. తెలంగాణ హార్టికల్చర్ విభాగం రైతు బాలాజీకి పంటసాగులో సాంకేతికంగా సహకారం అందించింది.

బాలాజీ ఆపిల్ సాగుకు ప్రోత్సాహాన్ని అందించేందుకు అతడి మూడు ఎకరాల్లో హార్టికల్చర్ విభాగం మరో 300 ఆపిల్ మొక్కలను అందించి నాటించింది. హైదరాబాద్ లోని సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఈ పంటను పండించడంలో సహాయం చేసింది.

ఎట్టకేలకు తాజాగా ఈ ఆపిల్ పంట కాపుకొచ్చింది. పూర్తిగా పండింది. తొలి పంట చేతికి వచ్చింది. రైతు బాలాజీ తెలంగాణ ఆపిల్స్ పెట్టెను ఉద్యానవన విభాగానికి పంపించి, వాటిని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంపమని అభ్యర్థించాడు. దీని గురించి తెలుసుకున్న కేసీఆర్.. రైతు బాలాజీని పిలిచి వ్యక్తిగతంగా కలవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఒకటి లేదా రెండు రోజుల్లో, సిఎం కెసిఆర్ రైతు పండించిన మొట్టమొదటి తెలంగాణ ఆపిల్ ను రుచి చూడబోతున్నాడు. 'వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఉండేలా రైతులు ఎప్పుడు వినూత్న పంటలు పండించాలి’ అనే ఎజెండాతో కెసిఆర్ ముందుకు వెళుతున్న కేసీఆర్ కు ఈ రైతు బాలాజీ స్ఫూర్తినిచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు.