Begin typing your search above and press return to search.

ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలది తలోదారి

By:  Tupaki Desk   |   19 Feb 2020 4:30 PM GMT
ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలది తలోదారి
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు ఎక్కువ. ఈ ప్రభావంతోనే ఆ పార్టీ వరుస ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింటోంది. ఒకరినొకరు తాము తోపంటే.. మరొకరు నేను గొప్ప అని చెబుతూ తమ ప్రతాపం చూపించేందుకు ముందుంటారు. అయితే ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చచ్చి చెడింది. బీజేపీ కన్నా తక్కువ సీట్లు పొంది అపప్రద పాలైంది. స్వరాష్ట్రం ఇచ్చిన పార్టీ మూడో స్థానంలో నిలవడంతో అందరూ షాకయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వచ్చి బీజేపీ లబ్ధి పొంది ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుపొందడం విశేషం. అయితే ఆ ఎన్నికల ఫలితాలను చూసి కూడా పాఠం నేర్వడం లేదు. ఇప్పుడు ఆ గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా తలో దారి చూసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా రేవంత్ రెడ్డి (మల్కాజిగిరి), కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్లగొండ) గెలిచారు. అయితే ఈ ముగ్గురి మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగత అజెండా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఉత్తమ్ ను చూస్తే కొమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డితో కలిసి తీవ్ర విమర్శలు చేస్తుంటాడు. సొంత జిల్లా నాయకులే.. సొంత పార్టీ అధ్యక్షుడి అని కూడా చూడకుండా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక రేవంత్ రెడ్డి ఉత్తమ్ తో కొనసాగుతున్నా తాను టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నానని తరచూ తన అనుచరులతో చెబుతూ వస్తుంటాడు. పార్టీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. కానీ పెద్దగా ఆసక్తితో ఉండడం లేదు.

అధ్యక్ష పదవి కోసం పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తుంటే ఉత్తమ్ సహాయం తో పొందవచ్చనే ఉద్దేశం తో రేవంత్ రెడ్డి ఉత్తమ్ తో కలిసి నడుస్తున్నాడు. కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యక్తిగత అజెండా తో వెళ్తున్నాడు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలను అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఇటీవల ఇందిరా పార్కు లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనలేదు. కానీ తన జిల్లా నల్లగొండ, భువనగిరిలో మాత్రం పార్టీ కేడర్ కు ఉత్సాహం నింపుతున్నాడు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాంగ్రెస్ కొంత ఊరటనిచ్చే ఫలితాలు వచ్చాయి. పార్టీ గెలుపు కోసం ఏకంగా అధికార పార్టీతో వాగ్వాదానికి దిగారు. ఆ రకంగా జిల్లాకే పరిమితమయ్యారు. కానీ పీసీసీ అధ్యక్ష రేసులో తానూ ఉన్నట్లు అప్పుడప్పుడు స్వరం ఎత్తుతున్నారు.

ఈ విధంగా ముగ్గురు మూడు దారుల్లో వెళ్తున్నారు. పార్లమెంట్ లో వీరి వాణి కూడా ఉండడం లేదు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆయన తన లోక్ సభ నియోజకవర్గం మల్కాజిగిరి పరిధిలో తన బలం పెంచుకునేందుకు చూస్తున్నాడు. అందుకే తరచూ నియోజకవర్గ పర్యటనలో ఉంటున్నాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డే పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. అయితే నల్లగొండ లో ఆయనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా ఉన్నారు. వారితో ఉత్తమ్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే తన లోక్ సభ నియోజకవర్గం నల్లగొండలో పర్యటించడం లేదు.

ఈ ముగ్గురు ఎంపీలుగా కొనసాగుతున్న ప్రాంతాల్లో కొమటిరెడ్డి మినహా మిగతా ఇద్దరి నియోజక వర్గంలో ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో పార్టీకి నామమాత్రపు ఫలితాలు వచ్చాయి. ముగ్గురు కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై గళం ఎత్తే విషయాన్ని మరచిపోయారు. పార్లమెంట్ లో వీరి వాణి వినిపించడం లేదు. ఈ విధంగా ఈ ముగ్గురు మూడు దారులు చూసుకుంటూ ఉంటే పార్టీని ఎవరు కాపాడేది.