Begin typing your search above and press return to search.

సమ్మె అప్ డేట్...దొర - రెడ్డి ఇద్దరూ తగ్గేలా లేరు!

By:  Tupaki Desk   |   20 Oct 2019 5:18 PM GMT
సమ్మె అప్ డేట్...దొర - రెడ్డి ఇద్దరూ తగ్గేలా లేరు!
X
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా సమ్మె విరమించేది లేదని తెగేసి చెబుతుంటే... సమ్మెకు ముగింపు పలకాలని హైకోర్టు చెప్పినా కూడా చూద్దాం... ఎంతదాకా వెళతారో అన్నట్లుగా సీఎం కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇటు సీఎం దిగరాకపోగా... అటు ఆర్టీసీ కార్మికుల నేత అశ్వత్థామరెడ్డి కూడా తామేమీ తక్కువ తినలేదంటూ సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించేశారు. ఆదివారం నాటికి సమ్మె 16వ రోజుకు చేరగా... ఇటు కేసీఆర్, అటు అశ్వత్థామరెడ్డిలు తమ తమ వాదనలకు కట్టుబడి సాగుతుండటంతో సమ్మె ఇప్పుడప్పుడే ముగిసేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు సమ్మెకు పరిష్కారం చూపకుండా సాగితే... ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన మిలియన్ మార్చ్ తరహాలో ఆర్టీసీ కార్మికులతో హాఫ్ మిలియన్ మార్చతో పోరును ఉధృతం చేస్తామంటూ అశ్వత్థామరెడ్డి ఆదివారం సంచలన ప్రకటన చేశారు.

సమ్మెపై పొలిటికల్‌ జేఏసీతో ఆదివారం ఆర్టీసీ జేఏసీ ప్రత్యేకంగా భేటీ అయింది. ఆర్టీసీ సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోసారి గవర్నర్‌ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌ను కోరాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఆర్టీసీ జేఏసీ మరోసారి సమావేశమవుతుందని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించేవరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పొలిటికల్‌ జేఏసీతో భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది.

ఈ నెల 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించనున్నారు. 22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు - కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని - సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష - 25న హైవేలు - రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 27న పండగ సందర్భంగా జీతాలు లేకపోవడంవల్ల నిరసన - 28న సమ్మెపై హైకోర్టు విచారణ సందర్భంగా విరామం. ఇక, ఈ నెల 30న 5లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని - ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి హైకోర్టు ఆదేశానికి సంబంధించిన పూర్తి పాఠం ప్రతి ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ కుమార్‌ శర్మ మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లారు. కోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా చర్చల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ వద్ద ఓసారి చర్చలు జరిగాయి. అయితే హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తూ, కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని, విజయం సాధించేవరకూ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆర‍్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.