Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో 700 టన్నుల బాంబ్ నిల్వ.. ఎంత సేఫ్?

By:  Tupaki Desk   |   13 Aug 2020 4:30 PM GMT
హైదరాబాద్ లో 700 టన్నుల బాంబ్ నిల్వ.. ఎంత సేఫ్?
X
ఆగస్టు 4.. లెబనాన్ రాజధాని బీరూట్ లో పెను విధ్వంసం.. ఒక చిన్నపాటి అణుబాంబు పేలినంత విధ్వంసం చోటుచేసుకుంది. 200మందికి పైగా మరణించారు. వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

బీరూట్ లో 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ సృష్టించిన ఈ విధ్వంసంతో ప్రపంచమంతా వణికిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలుసా? ‘అమ్మోనియం నైట్రేట్’ నిల్వలు పేలడమే.. ఈ నిల్వలు ఎంత ప్రమాదమో ఇప్పుడు ప్రపంచమంతా గ్రహిస్తోంది. మన ప్రాంతంలోనూ ఈ నిల్వలు ఉండడం అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది.

ప్రస్తుతం ఈ రసాయన నిల్వలున్న ప్రాంతాలలో అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించారు. భద్రతా చర్యలు సరిగ్గానే ఉన్నాయని.. ప్రమాదమేమీ లేదని చెబుతున్నారు. ప్రజల్లో మాత్రం భయం వీడడం లేదు.

భారత దేశంలో చూస్తే చెన్నై, విశాఖపట్నం రేవుల్లో భారీ ఎత్తున ఈ పేలుడు స్వభావం గల ‘అమ్మోనియం నైట్రేట్’ నిల్వలున్నట్లు సమాచారం. విశాఖ రేవుకు ఏడాదికి సగటున 2.7 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతుంది. విశాఖకు గత ఏడాది ఏకంగా 2,60,505 టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతైంది. అక్కడి నుంచి చత్తీస్ ఘడ్, తెలంగాణ, జార్ఖండ్, తెలంగాణ , ఒడిషా, బీహార్ రాష్ట్రాలకు దిగుమతి అయ్యింది..

తమిళనాడు రాజధాని చెన్నై నుంచి 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్ కు తరలుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మోనియం నైట్రేట్ గోదాములు పెద్దసంఖ్యలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

బీరూట్ లో పేలుడు తర్వాత తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ అమ్మోనియా నైట్రేట్ తరలింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని.. ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ కు కూడా పెద్ద ఎత్తున ఈ రసాయన పదార్థం వస్తోందన్న వార్త స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న హైదరాబాద్ కు చెందిన సాల్వో ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ వేలం ద్వారా ఈ అమ్మోనియం నైట్రేట్ ను కొనుగోలు చేసింది.

హైదరాబాద్ నగరం ఇప్పుడు పేలుడు పదార్థాల తయారీకి కేంద్రంగా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 25 అమ్మోనియం నైట్రేట్ గోడౌన్లు ఉన్నాయని అంటున్నారు.