Begin typing your search above and press return to search.

గవర్నర్ పై హైకోర్టుకు తెలంగాణ సర్కార్.. న్యాయసమీక్షపై హైకోర్టు పునరాలోచన?

By:  Tupaki Desk   |   30 Jan 2023 3:28 PM GMT
గవర్నర్ పై హైకోర్టుకు తెలంగాణ సర్కార్.. న్యాయసమీక్షపై హైకోర్టు పునరాలోచన?
X
తెలంగాణ బడ్జెట్ ను పంపినా గవర్నర్ ఆమోదించకపోవడంతో ఏకంగా హైకోర్టుకు ఎక్కింది తెలంగాణ ప్రభుత్వం. బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై మధ్యాహ్నం 1 గంటలకు విచారణ జరిపేందుకు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అంగీకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో గవర్నర్ కు కోర్టు నోటీస్ ఇవ్వగలదా? ఆలోచించుకోండి.. గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయసమీక్ష చేయవచ్చా? కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని మీరు అంటారు కదా?' అని అడ్వకేట్ జనరల్ (ఏజే) ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ పిటీషన్ పై జరిగే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సర (2023-24) బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా... దానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో దీనిపై సోమవారం హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయనుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించనున్నారు.

గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్‌ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ఇప్పటి వరకు గవర్నర్‌ ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మరి ఈ విషయంలో హైకోర్టు ఏం నిర్ణయిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.