Begin typing your search above and press return to search.

విన్నారా? టీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రైస్ లిస్టు..సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   13 Aug 2020 1:00 PM GMT
విన్నారా? టీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రైస్ లిస్టు..సాధ్యమేనా?
X
కరోనా వేళ.. కఠినంగా ఉండాల్సిన ప్రభుత్వం.. కొన్ని విషయాల్లో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ కావటం తెలిసిందే. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చిన వేళలోనే.. ట్రీట్ మెంట్ కోసం ఎంత ఛార్జ్ చేయాలన్న దానిపై మొదట్లోనే ధరల్ని డిసైడ్ చేశారు. అయినప్పటికీ.. వాటిని ఫాలో కాకుండా. .ఇష్టారాజ్యంగా దోచేస్తున్న వైనాలు వెలుగు చూశాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర రూపాయిల వరకూ బిల్లులు వేస్తున్న ఆసుపత్రులు హైదరాబాద్ లో చాలానే ఉన్నాయి.

ధరల దోపిడీతో పాటు.. వైద్యం చేయటంలోనూ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై పలు ఉదంతాలు వెలుగు చూశాయి. మీడియాలోనూ.. సోషల్ మీడియాలో రచ్చ నేపథ్యంలో.. రెండు ఆసుపత్రులపై తెలంగాణ సర్కారు షాకిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ.. పరిస్థితితు ఒక కొలిక్కి రాని వేళ.. తాజాగా ఒక కీలక అంశాన్ని వెల్లడించారు. దీని ప్రకారం.. తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు వసూలు చేసే మొత్తాలకు సంబంధించి డిస్ ప్లే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కరోనా చికిత్స విషయంలో.. ఏ చికిత్సకు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తారన్న విషయంపై ఆసుపత్రి ఆవరణలోనే ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి తాజాగా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ.. ప్రభుత్వం చెప్పిన ధరల్లో కాకుండా.. అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తే.. ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆసుపత్రిలో కట్టించుకున్న మొత్తానికి బిల్లు ఇవ్వాల్సి ఉంటుందని.. కాగితం మీద వేరుగా రాసి ఇస్తే ఊరుకోమని స్పష్టం చేశారు

ఏ వైద్యానికి ఎంత వసూలు చేస్తున్నారన్న విషయంతో పాటు..ఖరీదైన మందులు.. పీపీఈ కిట్ల ఎమ్మార్పీ ధరలను మాత్రమే వసూలు చేయాలని.. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని తేల్చారు. తాము జారీ చేసిన తాజా నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. రూల్స్ ను బ్రేక్ చేసేలా వ్యవహరించే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. మరి.. ఈ వార్నింగ్ పై ప్రైవేటు ఆసుపత్రులు ఎలా స్పందిస్తాయో చూడాలి.