Begin typing your search above and press return to search.

అప్పుల మీదే కాంగ్రెస్ పోరు..జ‌నాల్లోకి వెళ్తోందా?

By:  Tupaki Desk   |   14 Dec 2019 3:41 PM GMT
అప్పుల మీదే కాంగ్రెస్ పోరు..జ‌నాల్లోకి వెళ్తోందా?
X
తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు అప్పుల మీదే దృష్టి పెట్టారు. అది వారి వ్య‌క్తిగ‌త అప్పుల గురించినో, కాంగ్రెస్ పార్టీ అప్పుల గురించినో కాదు..తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల గురించి. కేసీఆర్ ప్ర‌భుత్వం ఇష్టానుసారం అప్పులు తెస్తోంద‌ని టీ కాంగ్రెస్ నేత‌లు రోజుకు ఒక‌రుగా మాట్లాడుతూ ఉన్నారు.

ప్ర‌త్యేకించి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాకా.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఈ విష‌యంలో గ‌ట్టిగా మాట్లాడుతూ వ‌స్తున్నారు. కేసీఆర్ అనేక ర‌కాల సంక్షేమ‌ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు. అవి సామాన్యుల‌కు ఉప‌యోగ‌ప‌డుతూ ఉన్నాయి. అలాగే వివిధ ప్రాజెక్టుల‌కూ భారీగా వెచ్చిస్తూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో స‌హ‌జంగానే ఖ‌జానా మీద భారం ప‌డుతూ ఉంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ వాళ్లు ప్ర‌స్తావిస్తూ ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం మిగులు బ‌డ్జెట్ తో ఏర్ప‌డితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్ మూడు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పులు చేశార‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. రాష్ట్రం అథోగ‌తి పాల‌వుతోంద‌ని అంటున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్లు మ‌ల్లు భ‌ట్టీ విక్ర‌మార్క‌తో పాటు వివేక్ త‌దిత‌ర నేత‌లంతా ఇదే వాద‌నే వినిపిస్తూ ఉన్నారు.

కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ఓట్ల ప్ర‌యోజ‌నాలు పొందుతున్న నేప‌థ్యంలో.. రాష్ట్రం అప్పుల పాల‌వుతోంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఒత్తి చెబుతూ ఉన్నారు. ఇలా ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం గురించి వ్య‌తిరేక‌త తీసుకురావాల‌నేది ఈ ప్ర‌య‌త్నం. తెలంగాణ రాష్ట్రం ప‌రిస్థితి వెనుజులాలా త‌యార‌వుతోంద‌ని వారు చెబుతున్నారు. అయితే సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు పొందుతున్న ప్ర‌జ‌లు కాంగ్రెస్ వాళ్ల వాద‌న‌ల‌ను ప‌ట్టించుకుంటారా?