Begin typing your search above and press return to search.

టి కాంగ్రెస్‌ లో 'పీసీసీ' రేసు..ఢిల్లీలో మకాం వేసిన కీలక నేతలు!

By:  Tupaki Desk   |   16 Dec 2019 12:58 PM GMT
టి కాంగ్రెస్‌ లో పీసీసీ రేసు..ఢిల్లీలో మకాం వేసిన కీలక నేతలు!
X
తెలంగాణ కాంగ్రెస్‌ లో టీ పీసీసీ చీఫ్ మార్పు గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై అతి త్వరలో కాంగ్రెస్ హై కమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్‌ లో పోటీ ఎక్కువగా ఉండటంతో... నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. అయితే భారత్ బచావో కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లిన నేతలు ఇదే అదనుగా లాబీయింగ్ మొదలు పెట్టారని సమాచారం.తమ అనుకూల నాయకుడికి పదవి కట్టబెట్టాలని కొందరు తంటాలు పడుతుంటే లేదు మావాడికే ఇవ్వాలని మరికొందరు హై కమాండ్ ముందు తమ అభిప్రాయాలని ఉంచుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సోనియగాంధీ అపాయింట్‌ మెంట్ కోసం పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క మాత్రం భారత్ బచావో కంటే ముందే సోనియాను కలిశారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆమె సోనియా ముందు తన వాయిస్ వినిపించారని సమాచారం. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్ - ఎంపీలు - సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లాంటి నాయకులంతా అక్కడే ఉండడంతో పీసీసీ చీఫ్ మార్పుపై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో శ్రీధర్ బాబు - రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రేసులో నేను కూడా ఉన్నానని హడావుడి చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండగా... త్వరలోనే ఆయన కూడా ఢిల్లీ వస్తారని తెలుస్తోంది. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టు పదే పదే చెప్తున్నారు.

తమకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అధికారంలోకి తీసుకొస్తామని నేతలు హై కమాండ్ కి హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే , ఆశావహుల లిస్ట్ భారీగా ఉండటంతో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతుంది అని తెలుస్తోంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందా లేక మరోసారి వాయిదా వేస్తుందో చూడాలి.