Begin typing your search above and press return to search.

కేసీయార్ మీద బీజేపీ : కార్నర్ చేస్తూనే.. ..పవర్ గేమ్ ...?

By:  Tupaki Desk   |   15 May 2022 11:30 PM GMT
కేసీయార్ మీద బీజేపీ :  కార్నర్  చేస్తూనే.. ..పవర్  గేమ్ ...?
X
రాజకీయం అంటేనే బోలెడు లెక్కలు ఉంటాయి. పైకి కనిపించేది అంతా నిజమూ కాదు, అలాగని ఊరుకుంటే అంతకంటే అన్యాయమూ ఉండదు. ఇక ఎన్నో ఢక్కామెక్కీలు తిన్న బీజేపీ ఇపుడు తెలంగాణా ఉద్యమకారుడు కమ్ సీఎం కేసీయార్ కి చుక్కలు చూపిస్తోంది. అక్కడ మోడీ ప్రధాని అయ్యాక ఇక్కడ కేసీయార్ కూడా దోస్తీ కట్టారు. దాదాపుగా నాలుగేళ్ళ పాటు ఆ బంధం సూపర్ గా సాగింది.

కేసీయార్ కోరికను మన్నించి ముందస్తు ఎన్నికలకు కూడా కేంద్రం పచ్చ జెండా ఊపిన సందర్భం ఉంది. ఇక అలాంటి కేసీయార్ మోడీ షాల కంట్లో నలుసు ఎలా అయిపోయారు అంటే దానికో కధ ఉంది. అది అందరికీ తెలిసిందే. తెలంగాణా సీఎం సీటుతో సంతృప్తి చెందకుండా కేసీయార్ 2019 ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేశారు. అంటే నేరుగా మోడీని ఢీ కొట్టడం అన్న మాట.

ఇక మరో వైపు చూస్తే మోడీ వేవ్ లో రెండవసారి గెలిచినా కేసీయార్ ని ఒక కంట కనిపెట్టడం మాత్రం బీజేపీ మానలేదు. అదే టైం లో కేసీయార్ లో ధీమా పెరిగింది. ఈసారి కచ్చితంగా మోడీ ఓడిపోతారంటూ గత కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల్లో వేలూ కాలూ పెడుతున్నారు.

కేసీయార్ స్టేట్ లో కేవలం 17 ఎంపీ సీట్లే ఉన్నాయి. కానీ ఆయన జాతీయ స్థాయిలో మోడీ యాంటీ క్యాంప్ ని కనుక బిల్డప్ చేస్తే రేపటి రోజున ఏదో రూపంలో ముప్పు పొంచి ఉంటుందని ఊహించిన మోడీ షా టీమ్ ఒక వ్యూహం ప్రకారమే కేసీయార్ ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పటికిపుడు మూడు సీట్లున్న బీజేపీ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 59 కి చేరుకోవడం అంటే అది అద్భుతమే అవుతుంది. అయితే మరో వైపు కేసీయార్ పొలిటికల్ గ్రాఫ్ కూడా బాగా పడిపోతోంది.

అదే టైమ్ లో కాంగ్రెస్ పుంజుకోవాలంటే జాతీయ స్థాయిలో ఊపు ఉండాలి. అది సరిగ్గా లేదు. దాంతో ఉంటే గింటే చాన్స్ తమకు ఉంటుందని తలచి బీజేపీ తెలంగాణా బరిలోకి దిగి గట్టిగానే కేసీయార్ తొడకొడుతోంది. అదే టైమ్ లో కేసీయార్ శ్రమను, పరిశ్రమను అంతా తెలంగాణాకే పరిమితం చేయాలన్నది బీజేపీ పక్కా ప్లాన్.

ఈ నేపధ్యంలో ఏది జరిగినా బీజేపీకే లాభం. జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్ ని ఎంట్రీ ఇవ్వకుండా పద్మవ్యూహం రచించడమే ఇందులో అసలైన రాజకీయం. ఇక కేసీయార్ కోరుకున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తమకు వీలు అయినపుడు మాత్రమే ఎన్నికలు జరిగేలా ప్లాన్ వేసి మరీ బీజేపీ గులాబీ బాస్ కి చెక్ చెప్పబోతోంది. మొత్తానికి పవర్ కోసం ఆడుతున్నట్లుగా ఈ గేమ్ లో అంతర్నాటకం మాత్రం పక్కాగా కేసీయార్ ని తెలంగాణా చట్రంలో ఇరికించి కార్నర్ చేయడమే ఉంది అని అంటున్నారు.