Begin typing your search above and press return to search.

తాజా సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీనేజ్ అమ్మాయిలు టాప్

By:  Tupaki Desk   |   17 Feb 2020 7:45 AM GMT
తాజా సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీనేజ్ అమ్మాయిలు టాప్
X
దేశంలోని బాలికల అక్ష రాస్యతపై తాజాగా ఒక సర్వే ఫలితం బయటకు వచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా.. నాందీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితం ఆసక్తికరంగా మారింది. 2019-20లలో దేశంలోని 600 జిల్లాల్లో భారీ సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు తాజాగా బయటకు వచ్చాయి. టీనేజ్ అమ్మాయిలు వంద శాతం అక్షరాస్యత సాధించిన నాలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం విశేషం.

బాలికల్లో అక్షరాస్యత శాతం పెరిగితే.. మాతా శిశు మరణాల్లో 50 శాతం వరకూ తగ్గించొచ్చన్న మాటను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయంపై 600 జిల్లాల్లోని 74 వేల మంది టీనేజ్ బాలికల్ని సర్వే లో భాగస్వామ్యం చేశారు. బాలికల విద్యపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి పెరిగిన వైనాన్ని ఈ సర్వే పేర్కొంది. అంతేకాదు.. 13 నుంచి 19 ఏళ్ల మధ్యనున్న అమ్మాయిల్లో కేరళ.. ఆంధ్రప్రదేశ్.. పశ్చిమబెంగాల్.. తెలంగాణ రాష్ట్రాలు వందశాతం అక్షరాస్యను సాధించి టాప్ లో నిలిచాయి.

ఏపీలో 82.8 శాతం బాలికలు బహిరంగ మల.. మూత్ర విసర్జన చేయకుండా సరైన పద్దతుల్ని ఫాలో అవుతున్న వైనాన్ని బయటకు తీసుకొచ్చింది. 56.4 శాతం మంది టీనేజ్ బాలికలు రుతుక్రమం వేళ.. పరిశుభ్రమైన పద్దతుల్ని పాటిస్తున్న వైనం వెల్లడైంది. ఏపీకి చెందిన 81.5 శాతం బాలికలు ఇంగ్లిష్.. కంప్యూటర్ నైపుణ్యాల్ని నేర్చుకోవాలని భావిస్తున్నారు. ఏపీ బాలికల్లో 96.6 వాతం మందికి పందొమిదేళ్ల లోపున పెళ్లి చేయకుండా చదివిస్తున్నారు. అదే సమయంలో ఈ శాతం పశ్చిమబెంగాల్ లో 88.9 శాతంగా ఉంది. 86 శాతానికి పైగా టీనేజ్ అమ్మాయిలు తమ పెళ్లి 21 ఏళ్ల తర్వాతే చేసుకోవాలన్న ఆలోచనలో ఉండటం గమనార్హం.