Begin typing your search above and press return to search.

టీమిండియా మ్యాచ్ ను ఎంజాయ్ చేసిన టీమిండియా .. అరుదైన సంఘటన... వీడియో వైరల్

By:  Tupaki Desk   |   21 July 2021 12:30 PM GMT
టీమిండియా మ్యాచ్ ను ఎంజాయ్ చేసిన టీమిండియా .. అరుదైన సంఘటన... వీడియో వైరల్
X
భారత క్రికెట్ ప్రపంచంలో మరో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఒక టీమిండియా ఆడుతుంటే.. మ‌రో టీమిండియా మ్యాచును చూస్తూ ఎంజాయ్ చేసింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఆసాంతం ఆస‌క్తిగా సాగగా , అభిమానులతో పాటు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ కూడా టీవీలకు అతుక్కుపోయి చూశారు. చివ‌రికి వాళ్ల విజ‌యాన్ని వీళ్లు సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్‌ లో ఒక టీమిండియా , ఇటు శ్రీలంక‌లో మ‌రో టీమిండియా మ్యాచ్‌ లు ఆడుతున్న విష‌యం తెలిసిందే.

మంగ‌ళ‌వారం విరాట్ కోహ్లీ సార‌థ్యంలోని సీనియ‌ర్ టీమిండియా ఇంగ్లండ్‌లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంటే, ఇటు శిఖర్ ధావ‌న్ కెప్టెన్సీలోని యువ టీమిండియా శ్రీలంక‌తో రెండో వ‌న్డే ఆడింది. ప్రాక్టీస్‌ అనంతరం టీమిండియా సీనియర్‌ జట్టులోని విరాట్‌ కోహ్లి, ఉమేశ్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కోచ్‌ రవిశాస్త్రి డ్రెస్సింగ్‌ రూమ్ నుంచి భారత్‌, లంక వన్డే మ్యాచ్‌ను ఆస్వాదించారు. మిగతా ఆటగాళ్లు కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడినుంచే మ్యాచ్‌ ను చూస్తూ ఎంజాయ్‌ చేశారు. చివ‌ర్లో దీప‌క్ చ‌హ‌ర్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ జోడీ ఊహించ‌ని విజ‌యాన్ని అందించడంతో ఇంగ్లండ్‌ లోని కోహ్లీసేన ఈ గెలుపును సెలబ్రేట్ చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో దీపక్‌ చహర్‌ అద్బుత ప్రదర్శనపై విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, పుజారా తదితరులు టీమిండియాకు అభినందనలు తెలిపారు.

ఆర్ అశ్విన్‌, చేతేశ్వర్ పుజారాలు బస్సులో వెళ్తూ.. టీమిండియా మ్యాచ్‌ గెలిచిందనగానే హైఫై ఇచ్చుకున్నారు. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, హనుమ విహారి మ్యాచును బాగా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. టీమిండియా సీనియర్‌ జట్టు, ఇంగ్లండ్‌ల మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. మరోపక్క మంగళవారం ప్రారంభం అయిన కౌంటీ ఎలెవెన్‌ తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతూ కోహ్లీసేన జోరు ప్రదర్శిస్తుంది. కరోనా వైరస్ పాజిటివ్‌ గా తేలడంతో రిషబ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌ కు దూరం అయ్యాడు. కాగా అతని గైర్హాజరీలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీతో దుమ్మురేపాడు. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ, రహానే, అశ్విన్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (50), చరిత్ అసలంక (65) అర్ధ సెంచరీలతో రాణించారు. భానుక 36, ధనంజయ డి సిల్వా 32, చివర్లో కరుణ రత్నె 44 పరుగులతో రాణించడంతో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్, భువనేశ్వర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ 2 వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

తొలి వన్డే హీరోలు పృథ్వీషా (13) ఇషాన్ కిషన్ (1) ఈసారి విఫలమయ్యారు. కెప్టెన్ శిఖర్ ధవన్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మనీష్ పాండే (37), సూర్యకుమార్ యాదవ్ (53), కృనాల్ పాండ్యా (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే, వీరు అవుటయ్యాక భారత ఓటమి ఖాయమనుకున్న వేళ క్రీజులో పాతుకుపోయిన చాహర్, భువనేశ్వర్ (19 నాటౌట్)తో కలిసి జట్టును విజయపథాన నడిపించాడు. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి, 49.1 ఓవర్లలో చేరుకొని, విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. శ్రీలంక బౌలర్లలో హసరంగా మూడు వికెట్లు తీసుకోగా, రజిత, లక్షణ్ శందాకన్, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు.