Begin typing your search above and press return to search.

తమిళనాడు : అనుకున్నంత పని చేసిన బీజేపీ .. ఏంటంటే ?

By:  Tupaki Desk   |   3 May 2021 8:30 AM GMT
తమిళనాడు : అనుకున్నంత పని చేసిన బీజేపీ .. ఏంటంటే ?
X
తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వీరవిహారం చేయకపోయినప్పటికీ , కొన్ని కలలు మాత్రం సాకారం అయ్యాయి. అందులో ముఖ్యమైంది తమిళనాడు అసెంబ్లీ లో బీజేపీ ఈసారి ఖచ్చితంగా అడుగుపెడుతుంది అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అందుకు తగ్గట్టుగానే రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత తమిళనాడు శాసనసభలో బీజేపీ ఖాతా తెరిచింది. మాజీ సీఎం జయలలిత‘అమ్మ’ను మరణం తర్వాత అన్నాడీఎంకేను చేరదీయడం ద్వారా తమిళనాడులో బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే కాలం వెళ్లదీశారు అనేది జగమెరిగిన సత్యం.

దీనితో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు కోరారు. తీవ్రస్థాయిలో తర్జన భర్జనల తరువాత 20 సీట్లకు ఒప్పందం కుదిరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా , కనీసం ఒక్కసీటైనా గెలిచి తీరుతాం, అసెంబ్లీలో అడుగుపెడతామని బీజేపీ నేతలంతా సవాల్‌ విసిరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. మురుగన్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, సినీనటి కుష్బు, అగ్రనేత హెచ్‌. రాజా తదితర హేమా హేమీలను పోటీపెట్టారు. ప్రధాని మోదీ, అమిత్‌షా ఇతర కేంద్రమంత్రులు భారీగా తరలివచ్చి బీజేపీ తరపున ప్రచారం చేశారు.పెద్దసంఖ్యలో బీజేపీ అభ్యర్థులు గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత ఈ రెండింటిలో ఒకటి నెరవేరకున్నా,తమిళనాడు అసెంబ్లీలో బీజేపీ ప్రవేశానికి మార్గం సుగమం అయ్యింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపు డు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని బీజేపీ రెండుసీట్లు గెలుచుకుంది. మళ్లీ ఇన్ని రోజులకి అదే అన్నాడీఎంకే కూటమి నుంచి బరిలోకి దిగి నాలుగు సీట్లల్లో గెలుపొందింది. రాష్ట్రంలో బీజేపీ పోటీచేసిన మొత్తం 20 స్థానాల్లో నాలుగింటిలో మాత్రమే గెలుపొందగా, వీటిల్లో కీలకస్థానమైన కోయంబత్తూరు దక్షిణంను సొంతం చేసుకోవడం విశేషం. బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌ హాసన్‌ పై గెలుపొందడం మరో విశేషం. దీనితో బీజేపీ పెద్దలు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించాం అని చెప్తున్నారు.