Begin typing your search above and press return to search.

మళ్లీ లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన తలసాని

By:  Tupaki Desk   |   4 July 2020 11:10 AM GMT
మళ్లీ లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన తలసాని
X
తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. మహమ్మారిని నియంత్రించలేక నిస్సహాయత పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో కరోనా విపరీతంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసితో పాటు దాని ప్రక్క ప్రాంతాలలో లాక్డౌన్ విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వ్యాప్తి ఆపడానికి లాక్డౌన్ విధించాలని పలు అభ్యర్థనలు ప్రభుత్వానికి వచ్చాయి. కానీ ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మళ్లీ లాక్ డౌన్ విధిస్తే తట్టుకోలేమని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ ప్రస్తుతం తెలంగాణలో గందరగోళం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంకా క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన హైదరాబాద్ కే చెందిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “లాక్డౌన్ ఒక పరిష్కారం కాదు. ఇది కరోనాకు పూర్తి పరిష్కరించలేదు. పూర్తిగా నియంత్రించలేడు. ప్రజలే మేల్కోవాలి. అన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా శుభ్రతను పాటించాలి. మాస్కులు లేకుండా బయటకు రావద్దు.. మీ చేతులను బాగా శుభ్రపరచండి. అదే కరోనాకు పరిష్కారం ” అని తలసాని అన్నారు.

ఇక తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులపై తలసాని స్పందించారు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను భారీ రద్దీ కారణంగా చేర్చుకోలేకపోతున్నాయని తలసాని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని కొందరు ప్రభుత్వాన్ని విమర్శించారని.. ఇప్పుడు ప్రైవేట్ దోపిడీ ఎక్కువైందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల వెలుపల దాదాపు 10 గంటలు వేచి ఉంటున్నా స్పందించడంలేదు. ప్రాణాలు పోతున్నాయి. రోగులపై బాధ్యతాయుతంగా స్పందించాలి.. రోగులను కూడా చూసుకునే స్థితిలో ప్రైవేట్ ఆస్పత్రులు లేవని తలసాని విమర్శించారు.

ప్రజలు కరోనాను చూసి భయపడవద్దని తలసాని కోరారు. ఈ వైరస్ అనుకున్నంత ప్రమాదకరమైనది కాదని అన్నారు. ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది ప్రతికూలంగా ఉంటుందని ఆయన అన్నారు. దీనికి చికిత్స ఉందని... చికిత్స కోసం రాష్ట్రంలో అనుభవజ్ఞులైన వైద్యులున్నారని అన్నారు. తలసాని వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వం లాక్ డౌన్ విధించకపోవచ్చని అర్థం అవుతోంది.

ఇప్పటికే, లాక్డౌన్ అమలు చేసిన ఏప్రిల్ - మే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయ నష్టాన్ని చవిచూసింది. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు 75 శాతం పెన్షన్లు మాత్రమే చెల్లించింది. వీటన్నింటినీ పరిశీలిస్తే, లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగులో ఉన్నట్లు తెలుస్తోంది.