Begin typing your search above and press return to search.

టీటీడీ సంచలన నిర్ణయం: అసెంబ్లీ సమావేశాల మాదిరి బోర్డు మీటింగ్

By:  Tupaki Desk   |   4 July 2020 4:30 PM GMT
టీటీడీ సంచలన నిర్ణయం: అసెంబ్లీ సమావేశాల మాదిరి బోర్డు మీటింగ్
X
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఇక పాలకవర్గ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. అది తన సొంత చానల్ ఎస్వీబీసీ చానల్ లో అసెంబ్లీ సమావేశాల మాదిరి మీటింగ్ నిర్వహించేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్‌ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టీటీడీలో జరిగే అన్ని బోర్డు మీటింగ్‌లను అసెంబ్లీ సమావేశాల మాదిరి ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. బోర్డు మీటింగ్‌లో జరిగే చర్చ అంతా పారదర్శకంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులందరికీ స్వాబ్ టెస్టులు చేయిస్తున్నామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమలలో ఎలాంటి ప్రత్యేక సేవ కార్యక్రమాలు చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం ఎలా చేయొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే ఆన్‌లైన్‌ కల్యాణోత్సవం తేదీ వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. తిరుమల కొండ పై కర్ణాటక సత్రం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకున్నామని.. ఏడున్నర ఎకరాల భూమిలో నిర్మాణాల కోసం రూ.200 కోట్లు కర్ణాటక ప్రభుత్వం ఇవ్వబోతుందని చైర్మన్ ప్రకటించారు. దీనికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో శుక్రవారం బెంగళూరులో భేటీ అయినట్లు వివరించారు.

త్వరలోనే సీఎం జగన్‌తో కలిసి, కర్ణాటక సీఎం యడ్యూరప్ప కర్ణాటక సత్ర నిర్మాణం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కొండ పై ప్రైవేట్ గెస్ట్ హౌస్ ల కేటాయింపు విషయంలో కొత్త విధానం తీసుకురాబోతున్నట్లు.. దీనికి సంబంధించి గెస్ట్ హౌజులు కేటాయింపుపై ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ సిస్టమ్ పెడుతున్నట్లు ప్రకటించారు. ఎవరు ఎక్కువ స్వామి వారికి విరాళం ఇస్తారో వారికి ప్రైవేట్‌ గెస్ట్ హౌజులు కేటాయించనున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.