Begin typing your search above and press return to search.

టీటీడీని వణికిస్తున్న కరోనా.. 140 మందికి పాజిటివ్ !

By:  Tupaki Desk   |   16 July 2020 1:15 PM GMT
టీటీడీని వణికిస్తున్న కరోనా.. 140 మందికి పాజిటివ్ !
X
కలియుగవైకుంఠం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం రేపుతోంది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాక్ డౌన్ లో ఏకంగా మూడు నెలల పాటు భక్తులని దర్శనాలకి అనుమతించలేదు. ఆ తర్వాత లాక్ డౌన్ నుండి సడలింపులు ఇవ్వడంతో తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీటీడీ సిబ్బంది సైతం కరోనా బారినపడ్డారు.

టీటీడీ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైర్మెన్ అత్యవసర భేటీ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 140 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా పాజిటివ్ గా ‌ వచ్చిన 140 మందిలో అర్చకులు, టీటీడీ ఉద్యోగులు, ఎస్టీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది, లడ్లు తయారు చేసే సిబ్బంది ఉన్నారని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఇప్పటికే 70 మంది కోలుకుని హోం క్వారంటైన్ ‌‌లో ఉన్నారని , వారిలో ఒక్కరు మినహా అందరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ముఖ్యంగా 40 మంది అర్చకుల్లో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. 60 సంవత్సరాలు నిండిన అర్చకులకి విధుల నుండి సడలింపు ఇచ్చామని తెలిపారు.

అలాగే , టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు టీటీడీ పై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ .. గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో ఉండి రమణ దీక్షితులు ట్విటర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు , ఏదైనా అనిపిస్తే బోర్డుకు సలహాలు ఇవ్వాలే కానీ మీడియాలో వ్యాఖ్యలు చేయడం రమణ దీక్షితులకు సబబు కాదని తెలిపారు. దీన్ని రాజకీయం చేయొద్దు అని అన్నారు. అర్చకులకు ఏ విధంగా ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామన్న అయన , అర్చకులకి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందనుకుంటే శ్రీవారి దర్శనాలు కూడా ఆపివేస్తామని తెలిపారు. స్వామి వారికీ కైంకర్యాలు జరగడం చాలా కీలకం అని , అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని తెలిపారు. అలాగే ఇప్పట్లో దర్శనాల సంఖ్య పెంచడం ఉండదని ‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.