Begin typing your search above and press return to search.

టీటీడీ ఆస్తుల అమ్మకాలపై బాబు హయాంలో అంత జరిగిందా?

By:  Tupaki Desk   |   24 May 2020 5:30 PM GMT
టీటీడీ ఆస్తుల అమ్మకాలపై బాబు హయాంలో అంత జరిగిందా?
X
ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నంతనే అదే పనిగా విమర్శించే వారు.. గతంలో ఏం జరిగింది? అన్న విషయాన్ని వదిలేస్తారు. టీటీడీలోని నిరర్థక ఆస్తుల్ని అమ్మకానికి పెడుతూ టీటీడీ గత నెల 30న ఒక తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. దీంతో.. టీటీడీ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు విపక్షనేతలు.

శ్రీవారిపై నమ్మకంతో భక్తులు తమ ఆస్తుల్ని ఇస్తే.. ఇవాల్టి రోజున వాటిని అమ్మే ప్రయత్నం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు పలువురు. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్న విపక్షాలు.. గతంలో ఏం జరిగిందన్న విషయాన్ని పట్టించుకోవటం లేదు. భూముల అమ్మకాలపై మండిపడుతున్న వారిలోచాలామంది ఐదేళ్ల క్రితం.. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో నాటి టీటీడీ చేసిన పనిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

టీటీడీలోని నిరర్థక ఆస్తుల్ని అమ్మాలంటూ దాదాపుగా మూడేళ్ల పాటు చేసిన కసరత్తును మర్చిపోకూడదు. అంతిమంగా ఆ నిర్ణయాన్ని అమలు చేయకున్నా.. అన్నేళ్ల పాటు సాగిన కసరత్తు గురించి నాటి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయాలి కదా? అలాంటి పనులు అసలెందుకు షురూ చేశారని ప్రశ్నించాలి కదా? అవేమీ లేకుండా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే తప్పు పట్టటంలో అర్థం లేదంటున్నారు.

2015 జులై 28న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నిరర్థక ఆస్తుల విక్రయాలపై చర్చ సాగింది. ఇరుకైన.. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నపాటి స్థలాలు.. ఇళ్లను.. జనావాసాలకు మరీ దూరంగా ఉండి నిర్వహణకు వీలు కాని తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల్ని అమ్మటమే మంచిదని అప్పటి టీటీడీ బోర్డు భావించింది. దీనికి తగ్గట్లే తీర్మానం చేసింది.

వివిధ రాష్ట్రాల్లో ఉన్న 53 ఆస్తుల్ని గుర్తించారు. వాటిని అమ్మటానికి అనువుగా ఉన్నాయా? లేవా? అన్న దానిపై ఒక సబ్ కమిటీ వేశారు. వాటిని నాలుగు కేటగిరిలు చేసి.. విజయవాడలో ఒకటి.. తమిళనాడులోని రెండు ఆస్తుల్ని మినహా మిగిలినవాటిని అమ్మొచ్చంటూ సిఫార్సు చేసింది. దీనిపై 2016 జనవరి 30న తీర్మానం కూడా చేశారు.

2018 మార్చి 28న ఈవో.. తిరుపతి జేఈవో.. ఎస్టేట్స్ ఆఫీసర్ లు సమావేశమై.. నాలుగు కేటగిరిలో ఉన్న ఆస్తుల గురించి సమీక్షలు జరిపారు. మొత్తంగా టీటీడీ ఆస్తుల్ని బహిరంగ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించారు. అయితే.. ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాటి అమ్మకాలు ఆగిపోయాయి. అయితే.. మూడేళ్ల పాటు సాగిన అమ్మకాల ప్రక్రియను మొదట్లోనే అప్పటి ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి.