Begin typing your search above and press return to search.

కొత్త పరిణామం?..గవర్నర్ ను కలవనున్న ఆర్టీసీ సంఘ నేతలు

By:  Tupaki Desk   |   9 Oct 2019 9:54 AM GMT
కొత్త పరిణామం?..గవర్నర్ ను కలవనున్న ఆర్టీసీ సంఘ నేతలు
X
ఆట ఎప్పుడూ ఒకరే ఆడలేరు. రాజకీయ క్రీడ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తనకున్న పరిమితుల్ని తెలంగాణ సీఎం మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేయాలన్న తలంపులో రాజకీయ పార్టీలు.. ఉద్యోగ సంఘాలు ఉన్న వేళలో.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న వారికి.. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చక్కటి అవకాశంగా మారుతోంది.

కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ఉద్యమనాయకుడిగా వారి డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించాల్సిన దానికి భిన్నంగా వ్యవహరించటం ద్వారా కేసీఆర్ సంచలనంగా మారారు. ఒక ఉద్యమనాయకుడు ముఖ్యమంత్రి అయితే.. ఉద్యమాల్ని.. ఆందోళనల్ని ఇలా అడ్డుకుంటారా? తీవ్రమైన చర్యలకు తెర తీస్తారా? అన్న చర్చకు కేసీఆర్ కారణంగా మారారని చెప్పాలి.

తమ ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరని నేపథ్యంలో 48 వేల మంది ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ వ్యాఖ్యలు చేయటం ద్వారా కేసీఆర్ సంచలనంగా మారారు. ఎడాపెడా అన్నట్లుగా తీసుకుంటున్న కేసీఆర్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు వీలుగా ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు తమదైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

తాజాగా తమ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై జోక్యం చేసుకోవాలని.. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం తాము చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ.. తమకు న్యాయం చేయాలని కోరుతూ గవర్నర్ తమిళ సైను కలిసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి తప్పదంటున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై గవర్నర్ తమిళ సై ఆరా తీస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ.. కార్మిక సంఘ నేతలు గవర్నర్ ను కలిసి వినతిపత్రాన్ని ఇస్తే.. ప్రభుత్వ నిర్ణయంపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ కోరే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. జరిగిన పరిణామాల్ని రిపోర్ట్ రూపంలో ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో సెల్ఫ్ డిస్మిస్ లాంటి విషయాన్ని ప్రస్తావించటం కుదరదు. అలాంటప్పుడు తమ వాదనను ప్రభుత్వం గవర్నర్ కు ఎలా చెబుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.