Begin typing your search above and press return to search.

దసరా సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   12 Oct 2019 2:19 PM GMT
దసరా సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం
X
ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో కఠినంగా ఉండాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే అందుకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్ ను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదని తేల్చేసిన తెలంగాణ సర్కారు.. ఇప్పటికే సంస్థకు చెందిన 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. దసరా పండక్కి ముందు మొదలైన ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు తెరవనున్నారు. దసరా నేపథ్యంలో స్కూల్ బస్సు డ్రైవర్లను ఆర్టీసీ డ్రైవర్లుగా తాత్కాలికంగా సర్దుబాటు చేసి.. ఆర్టీసీ ఉద్యోగుల మీద ఒత్తిడి పెంచుతోంది ప్రభుత్వం. స్కూళ్లు మొదలైన పక్షంలో స్కూల్ బస్సు డ్రైవర్లు.. వారి విధుల్లో చేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. విద్యాసంస్థలకు ఈ నెల 19 వరకు దసరా సెలవుల్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఈ లోపు పూర్తిస్థాయిలో బస్సుల్ని సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు.

ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవటంతో పాటు.. బస్సులు నడిపేందుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవటానికి అవసరమైన నోటిషికేషన్ జారీ చేయాలని చెప్పారు. సమ్మె కారణంగా దసరా సెలవుల్ని పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు తీసుకోవటం.. విద్యార్థులకు పండుగగా మారుతుందని చెప్పక తప్పదు.