Begin typing your search above and press return to search.

‘గుట్కా’ పంచుకున్నారన్న ఆరోపణలపై స్పందించిన టీఆర్ఎస్ మంత్రి

By:  Tupaki Desk   |   20 July 2021 2:30 PM GMT
‘గుట్కా’ పంచుకున్నారన్న ఆరోపణలపై స్పందించిన టీఆర్ఎస్ మంత్రి
X
ఇటీవల టీఆర్ఎస్ మంత్రులు తలసాని, గంగుల కమలాకర్ లు ఏదో రహస్యంగా చేతుల్లో పంచుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దీన్ని షేర్ చేసి.. 'ఇది గుట్కానే అని.. తెలంగాణలో నిషేధం ఉన్నా ఈ మంత్రులకు ఎలా దొరికిందంటూ' తన ట్విట్టర్ లో ప్రశ్నించాడు.

తెలంగాణ ప్రభుత్వం కూడా గుట్కాను నిషేధించింది.కానీ ఇది చాలా చోట్ల అక్రమంగా కనిపిస్తూనే ఉంది. గుట్కాలు, జర్ధాలు లేని చోటు అంటూ లేదు. అమ్మకందారులు విరివిగానే అమ్ముతున్నారు.

తాజాగా ఇద్దరు తెలంగాణ మంత్రులు చేతిలో నంజుకొని నోట్లో వేసుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్ లు రహస్యంగా తిన్న ఆ పదార్థం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్వీట్ చేశాడు. 'తెలంగాణలో గుట్కా నిషేధించబడింది. కానీ ఈ మంత్రులు దాన్ని ఎలా పొందగలిగారు? ఎవరు అక్రమ రవాణా,సరఫరాచేస్తున్నారు. నిషేధిత ఉత్పత్తులను వినియోగిస్తున్న ఈ మంత్రులపై పోలీసులు చర్యలు తీసుకుంటారా?' అని ప్రశ్నించారు. వెంటనే తలసాని, గంగులను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ ను దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. మంత్రులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. టీఆర్ఎస్ పాలనలో అక్రమ మాదక ద్రవ్యాల రవాణా కేంద్రంగా హైదరాబాద్ మారుతోందని శ్రావణ్ ఆరోపించారు.

ఈ వీడియోలో తలసాని, గంగుల రహస్యంగా ఏదో పంచుకుంటూ తింటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. నెటిజన్లు ఇది గుట్కా అని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. మంత్రులిద్దరూ రహస్యంగా పంచుకున్న ఆ వీడియో షేర్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో దుమారం చెలరేగింది. వారు ఏం పంచుకున్నారన్నది తెలియనప్పటికీ నెటిజన్లు, మీడియా ఇది 'గుట్కా'నే అని కామెంట్లు చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు ఇద్దరు టీఆర్ఎస్ మంత్రులను కొద్దిరోజులుగా తెగ ట్రోల్ చేశారు.

తాజాగా కరీంనగర్ లో ఈ వివాదంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. 'నేను చాలా కెమెరాలు, మీడియా సమక్షంలో గుట్కాను ఎలా తినగలను.. నాకు గుట్కా, సిగరెట్ లేదా ఇతర నిషేధిత పదార్థాలు అలవాటు లేదు. ఒకవేళ నేను గుట్కా తినాలనుకుంటే అది నిషేధిత పదార్థం కనుక రహస్యంగా గదిలో తింటాను. కానీ మీడియా , సోషల్ మీడియా సాక్షిగా తింటానా? ఈ వీడియోను అనవసరంగా వైరల్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యూస్ చానెళ్లలో అనవసరంగా ట్రోల్ చేసి స్క్రోల్ చేస్తున్నారు ' అని కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తనను చంపడానికి ఓ టీఆర్ఎస్ మంత్రి కుట్ర చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపణలపై కూడా మంత్రి గంగుల స్పందించారు. 'ఈటల ప్రాణాలను కాపాడడానికి నా ప్రాణాలు ఫణంగా పెడుతానని ' చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో హత్యలుండవని.. ఆత్మహత్యలే ఉంటాయని ఈటలకు గంగుల కౌంటర్ ఇచ్చారు. ఈటల తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నారన్నారు.

ఒకవేళ నిజంగా నేను ఆ పనులు చేసి ఉంటే మీ కేంద్రమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసి సీబీఐ ఎంక్వైరీ వేసి తనపై విచారణ చేసుకోవచ్చని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ చేశారు. ఈటల ఆరోపణలు అన్ని అవాస్తవాలని అన్నారు. నాకు ఈటలతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని.. పెద్దమ్మతల్లిపై ప్రమాణం చేస్తానని గంగుల అన్నారు. ఈటల కూడా ప్రమాణం చేయాలని.. అబద్దమాడితే పెద్దమ్మతల్లియే ఆయనను శపిస్తుందని గంగుల ఆక్షేపించారు.

ఇలా ఈటల రాజేందర్-కమలాకర్ మధ్య వాద ప్రతివాదనలతో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడెక్కింది. ఇద్దరూ మాటకు మాటగా సమాధానాలు చెబుతుండడంతో ఈ ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి.