Begin typing your search above and press return to search.

అలా మాట్లాడితే సారుకు కోపం రాదా సునీతమ్మ?

By:  Tupaki Desk   |   10 Dec 2019 11:01 AM GMT
అలా మాట్లాడితే సారుకు కోపం రాదా సునీతమ్మ?
X
టీఆర్ ఎస్ మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. చివరకు పార్లమెంటులోనూ తెలంగాణ పోలీసులు.. ప్రభుత్వం చేసిన చర్యకు ప్రశంసలు వర్షం కురిసిన ఉదంతంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పాశవికంగా హతమార్చిన దిశ నిందితులు ఎన్ కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై నిన్నటికి నిన్న ఏపీ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తెలంగాణ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంతలా పొగిడేశారో తెలియంది కాదు. ఇదిలా ఉంటే.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ చాలా బాధాకరమని ఆమె చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చగా మారాయి. నిందితుల తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారామె. ఎన్ కౌంటర్ లో చనిపోయిన యువకుల తల్లిదండ్రులు చాలా బాధ పడి ఉంటారన్న ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓపక్క ఎన్ కౌంటర్ పై తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి శభాష్ అని.. సినిమాల్లో హీరో మాదిరిగా వ్యవహరించారంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశంసించిన వైనాన్ని మర్చిపోలేం.

ఇలాంటివేళ.. అందుకు భిన్నంగా గొంగడి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి మాటలు సారుకు కోపం వస్తాయని తెలిసే ఆమె అలా మాట్లాడారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా ఇప్పటివరకూ ఎన్ కౌంటర్ మీద నెగిటివ్ గా ఏ ఒక్క టీఆర్ ఎస్ నేత మాట్లాడని వేళ.. అందుకు భిన్నంగా గొంగడి సునీతమ్మ మాట్లాడిన మాటలు సీఎం సారుకు సురుకు పుట్టిస్తాయన్న మాట వినిపిస్తోంది. అందరూ ఒక దారిన పోతుంటే అందుకు భిన్నమైన గళాన్ని విప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.