Begin typing your search above and press return to search.

ఫైబ‌ర్ గ్రిడ్‌లో కుంభ‌కోణం.. స‌ర్కారు వాద‌న‌కు టీడీపీ రియాక్ష‌న్ ఇదీ!

By:  Tupaki Desk   |   14 Sep 2021 1:18 PM GMT
ఫైబ‌ర్ గ్రిడ్‌లో కుంభ‌కోణం.. స‌ర్కారు వాద‌న‌కు టీడీపీ రియాక్ష‌న్ ఇదీ!
X
1ఏపీ ఫైబ‌ర్ గ్రిడ్/ ఫైబ‌ర్ నెట్ల విష‌యంలో ర‌గ‌డ రాజుకుంది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ విష‌యంలో భారీ స్కాం చేసింద‌నేది ప్ర‌స్తుత ఏపీ స‌ర్కారు వాద‌న‌. గ‌తంలో ఐటీ శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌.. హ‌యాంలోనే ఈ స్కాం జ‌రిగింద‌ని కూడా చెబుతోంది. దాదాపు 121 కోట్ల కుంభ కోణం దీనిలో దాగి ఉంద‌ని వైసీపీ నాయ‌కుడు, ఫైబ‌ర్ గ్రిడ్ ప్ర‌స్తుత చైర్మ‌న్ పూనూరు గౌతంరెడ్డి చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇదంతా క‌ట్టుక‌ధేన‌ని.. ఎలాంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌లేద‌ని.. టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్టాభి రాం వివ‌రిస్తున్నారు. దీంతో అటు ప్ర‌భుత్వం, ఇటు ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం వాద‌న‌లు ఆస‌క్తిగా మారాయి.

మ‌రో వైపు.. ఈ కేసులో విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సీఐడీ.. వేమూరి హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్‌ నెట్‌లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించిన‌ట్టు అధికారులు తెలిపారు. ఇక‌, ఈ విష‌యంలో ప్ర‌భుత్వ‌, ప్ర‌తిప‌క్ష వాద‌న‌లు ఇవీ..

ప్ర‌భుత్వ వాద‌న ఏంటంటే..

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నెట్ ను అనుసంధానం చేసేందుకు ఫైబ‌ర్ గ్రిడ్‌ను గ‌త ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. దీనికి సంబంధించి టెండ‌ర్లు కేటాయించింది. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని టెరాసాఫ్ట్‌ కంపెనీకి రూ.321 కోట్ల విలువైన టెండర్లు అప్పగించడమే కాకుండా రూ.121 కోట్ల పనులకు అక్రమ చెల్లింపులు జరిపారన్నది ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వ వాద‌న‌. వి టీడీపీ ప్రభుత్వ హయాంలోని కొంతమంది పెద్దలు టెరాసాఫ్ట్‌ పేరుతో ఏ విధంగా టెండర్లు దక్కించుకున్నారన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయని కూడా ప్ర‌స్తుత ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్ గౌతం రెడ్డి చెబుతున్నారు.

టెరాసాఫ్ట్‌కు ఎండీగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్‌ 2015లో టెండర్లు పిలిచే సమయానికి ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయించి ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ టెండర్ల పరిశీలన కమిటీలో సభ్యునిగా నియమించారని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, ఏడాదిపాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఆ సంస్థను కేవలం రెండు నెలల్లోనే నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించారని.. టెండర్ల గడువును ఒక వారం పొడిగించి బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించిన మర్నాడే ఆ కంపెనీతో టెండర్లు వేయించారన్నారు. టెరాసాఫ్ట్‌కు ఈ రంగంలో అనుభవం లేకపోయినా టెండర్లు కట్టబెట్టినట్లు ఆయన తెలిపారు. ఇలా అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వైనంపై బేస్‌ పవర్‌ సిస్టమ్స్‌ అనే కంపెనీ ఫిర్యాదు చేస్తే దానిపై దర్యాప్తు చేయకుండా, ఏకంగా ప్రభుత్వమే బేస్‌ పవర్‌ సిస్టమ్స్‌పై కేవియట్‌ దాఖలు చేసిందంటే ఈ కుట్ర వెనకున్న వారి హస్తం స్పష్టంగా తెలుస్తోందన్నారు.

టీడీపీ వాద‌న ఇదీ..

ఏపీని ఫైబర్‌నెట్ రోల్‌ మోడల్‌ చేసిందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫైబర్‌నెట్‌ను ప్రశంసించిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. వినూత్నమైన ఆలోచన నుంచి పుట్టిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్‌నెట్‌ అని, ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడ అమలు కాలేదన్నారు. ఇలాంటి కార్యక్రమానికి అప్పటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. అలాంటి ఫైబర్‌ నెట్‌లో అక్రమాలంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రతిష్టాత్మక ఫైబర్‌ నెట్‌పై బురదజల్లే కార్యక్రమం జరుగుతోందని పట్టాభి మండిపడ్డారు.

ఫైబర్‌ నెట్‌లో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం జరుగుతోందని పట్టాభి అన్నారు. గత ప్రభుత్వంలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అసత్యప్రచారం చేస్తున్నారని, ఏ ఒక్కటీ రుజువు కాలేద‌న్నారు. ఒకే కనెక్షన్‌తో రూ.149కే మూడు రకాల సేవలు అందించే ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు అని, దేశమంతా ఈ విధానాన్ని అవలంబించాలని ప్రధాని అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అవినీతి జరిగిందంటున్న గౌతమ్‌రెడ్డి పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని పట్టాభి వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.