Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నిక‌ల త‌ర్వాతే.. మోడీపై బాబు నోరు తెరుస్తారా?

By:  Tupaki Desk   |   31 May 2021 11:30 AM GMT
యూపీ ఎన్నిక‌ల త‌ర్వాతే.. మోడీపై బాబు నోరు తెరుస్తారా?
X
టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఏ విష‌యాన్ని తీసుకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిపాటి. అయితే.. ఇది కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు అంటే.. దాదాపు ఎన్నిక‌ల‌కు ముందు ప‌రిస్థితిలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు బాగానే టార్గెట్ చేశారు. మోడీని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర‌స్థాయి లో విరుచుకుప‌డ్డారు. అయితే.. త‌ర్వాత కాలంలో మాత్రం..చంద్ర‌బాబు ఫుల్లుగా జ‌గ‌న్‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని కానీ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీని కానీ, ఎక్క‌డా టార్గెట్ చేయ‌డం లేదు.

ఏ విష‌యం తీసుకున్నా..రాష్ట్రంలోని జ‌గ‌న్ స‌ర్కారుపైనే చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు చంద్ర‌బాబు ఇంత మౌనంగా ఉన్నారు? అంటే.. ఎప్ప‌టికై నా.. బీజేపీతో ఆయ‌న పొత్తు పెట్టుకునే యోచ‌న‌లో ఉన్నార‌ని.. అందుకే ఈ మౌనం పాటిస్తున్నార‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో నూ చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త గా ప‌రిశీలించారు. ముఖ్యంగా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌రింత ఎక్కువ‌గా బీజేపీపై క‌న్నేశారు.

నిజానికి బెంగాల్లో క‌నుక‌.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. చంద్ర‌బాబు.. బీజేపీకి ఇప్ప‌టికే చేరువ‌య్యే వార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, బెంగాల్‌లో మోడీ వ్యూహం బెడిసి కొట్టింది. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. యూపీలో ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌భుత్వ‌మే ఉంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఏడాది ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో క‌నుక‌.. మోడీ వ్యూహం ఫ‌లిస్తే.. చంద్ర‌బాబు పుంజుకున్న‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

యూపీలో క‌నుక బీజేపీ మ‌రోసారి వ‌రుస విజ‌యంద‌క్కించుకుంటే.. మోడీ హ‌వా పెరిగే అవ‌కాశం ఉంది. లేక‌పోతే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో క‌రోనా స‌హా పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల వంటివి మోడీకి ఇబ్బందిగా మార‌డం ఖాయం. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు యూపీ ఎన్నిక‌ల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నార‌నేది వాస్త‌వం. ఆ ఎన్నిక‌ల్లో క‌నుక మోడీ నేతృత్వంలోని బీజేపీ ఓడిపోతే.. వెంట‌నే చంద్ర‌బాబు థ‌ర్డ్ ఫ్రంట్‌కు జై కొట్ట‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

అయితే.. బీజేపీతో ఉంటే.. త‌మ‌కు విజ‌యం త‌థ్య‌మ‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. ఈ క్ర‌మంలో ఆ పార్టీకి సంబంధించిన జాతీయ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌నేది వాస్త‌వం. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించే విష‌యంపైనే బాబు వ్యూహం ఉంటుంద‌ని చెబుతున్నారు. మోడీ క‌నుక ప్ర‌భావం కోల్పోతే.. వెంట‌నే థ‌ర్డ్ ఫ్రంట్‌కు జైకొ ట్టి ఢిల్లీలో `చ‌క్రం` తిప్పేందుకు రెడీ అవుతార‌ని.. లేక‌పోతే.. బీజేపీతో పొత్తుకు రెడీ అవుతార‌ని.. అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.