Begin typing your search above and press return to search.

మండలి లో పంతం నెగ్గించుకున్న టీడీపీ ... మరో సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:25 AM GMT
మండలి లో పంతం నెగ్గించుకున్న టీడీపీ ... మరో సంచలన నిర్ణయం !
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో టీడీపీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు శాసనసభ కార్యక్రమాలను టీడీపీ బహిష్కరించింది. అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. శానసమండలిలో నిన్న (బుధవారం) జరిగిన పరిణామాలపై టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో అసెంబ్లీకి హాజరుకాకూడదని చంద్రబాబు నిర్ణయించారు. ప్రధానంగా నిన్న శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA బిల్లులపై చర్చ సందర్భంలో... వైసీపీ మంత్రులు అడ్డుతగిలారనీ, సభా సంప్రదాయాల్ని పాటించకుండా, తమ ఎమ్మెల్సీల పై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది వైసీపీ. అయితే, సంఖ్యా బలం ఉండడంతో, ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. ఇకపోతే, మరోవైపు ఇవాళ టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీతో పాటూ మండలిలో తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దౌర్జన్యం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యా చరణపై చర్చించనున్నారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేయనున్నారు.

మరోవైపు నిన్న మండలిలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ కూడా సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి... అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం భావించినట్టుగానే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎదురయ్యే సమస్యల గురుంచి న్యాయనిపుణులతో పార్టీ కీలక నేతలతో తాడేపల్లిలోని తన ఇంట్లో న్యాయ నిపుణులు, ఎంపీ విజయసాయిరెడ్డి తో సీఎం జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం.