Begin typing your search above and press return to search.

టీడీపీలో సోషల్ ఫైట్.. స్ట్రీట్ ఫైట్ గా మారుతోందా?

By:  Tupaki Desk   |   14 Dec 2019 5:55 AM GMT
టీడీపీలో సోషల్ ఫైట్.. స్ట్రీట్ ఫైట్ గా మారుతోందా?
X
వాళ్లిద్దరూ ప్రత్యర్థులు.. ఒక ఒరలోకి వచ్చారు. చంద్రబాబు కుదిర్చిన సయోధ్యతో కలిసి పోటీచేసి ఇద్దరూ విజయం సాధించారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీ మార్పుల కలకలం వారిద్దరి మధ్య ‘సోషల్’ ఫైట్ కు దారితీసింది. ఒకరినొకరు నోరుపారేసుకునేలా చేసింది.

2014 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి టీడీపీ తరుఫున కరుణం బలరాం.. వైసీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ పోటీచేశారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలుననాయి. ఈ పోరులో గొట్టిపాటి గెలిచారు. కరుణం ఓడిపోయారు. అయితే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గొట్టిపాటి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. చంద్రబాబు కరుణంను ఒప్పించి సర్ధిచెప్పారు.

అయితే 2019 ఎన్నికల్లో అద్దంకి సీటు ఫైట్ నడిచింది. తమకే కావాలని కరుణం, గొట్టిపాటి కత్తులు నూరుకున్నారు. చివరకు చంద్రబాబు అద్దంకిని సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటికి ఇచ్చి చీరాలను కరుణంకు ఇచ్చి సెటిల్ చేశారు. ఇద్దరు ఒకరి గెలుపునకు ఒకరు సహకరించుకున్నారు. విభేదాలు పక్కనపెట్టారు.

అయితే తాజాగా గొట్టిపాటి మైనింగ్ క్వారీలపై వైసీపీ సర్కారు దాడులు మొదలుపెట్టిందనే ప్రచారం సాగింది.. ఆయన్ను పార్టీలోకి చేర్చుకునేందుకు సంప్రదింపులు చేస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారబోతున్న గొట్టిపాటికి సెటైర్ గా కరుణం పేరుతో సోషల్ మీడియాలో ఒక హాట్ కామెంట్ పోస్ట్ అయ్యింది. ‘బెదిరిస్తే బెదిరిపోయి పార్టీ మారడానికి మాకు వ్యాపారాలు లేవు.. పార్టీ మారాల్సిన కర్మ మాకు పట్టలేదని’ గొట్టిపాటిని దెప్పిపొడుస్తూ పోస్టు పెట్టారు.

దీంతో వీరిద్దరి మధ్య పోరు మళ్లీ మొదలైంది. దీనికి కౌంటర్ గా గొట్టిపాటి కూడా సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాడు. ‘20 ఏళ్లుగా చేస్తున్న క్వారీ వ్యాపారం అది.. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటా.. టీడీపీని వీడను.. జై తెలుగుదేశం అని’ కౌంటర్ ఇచ్చాడు.

అయితే ఈ రెండు పోస్టులు కరుణం, గొట్టిపాటి చేయలేదని ఆయన ఫ్యాన్స్ చేశారని అంటున్నారు. కానీ ఒకేపార్టీలోని నేతలు ఇలా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా కొట్టుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సోషల్ ఫైట్ స్ట్రీట్ ఫైట్ గా మారకముందే అధిష్టానం కల్పించుకొని వీరికి సర్దిచెప్పాలని నేతలు సూచిస్తున్నారు..