Begin typing your search above and press return to search.

విశాఖ టీడీపీలో ర‌చ్చ‌ర‌చ్చ‌..

By:  Tupaki Desk   |   17 July 2019 7:01 AM GMT
విశాఖ టీడీపీలో ర‌చ్చ‌ర‌చ్చ‌..
X
టీడీపీలో నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త‌ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైనప్ప‌టి నుంచి పార్టీలో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మె ల్సీ, విజ‌య‌వాడ అర్బ‌న్ పార్టీ అధ్య‌క్షుడు బుద్ధా వెంక‌న్న మ‌ధ్య నెల‌కొన్న వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఒక‌రిపై ఒకరు సోష‌ల్‌మీడియా వేదిక‌గా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు క‌లుగ‌జేసుకుని, వారించ‌డంతో ఈ వివాదం కొంత స‌ద్దుమ‌ణిగింది.

స్వ‌యంగా చంద్ర‌బాబు జోక్యం చేసుకున్నా ఎంపీ నాని మాత్రం వెన‌క్కు త‌గ్గ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇంత‌లోనే విశాక టీడీపీలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. వ‌రుస‌గా పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ వివాదాలు చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారాయి. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వివాదం ర‌చ్చ‌కెక్కింది. పార్టీ కార్యాలయం వేదికగా తెలుగు త మ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. ఎన్నికల ముందు వరకు పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ను తప్పించి నాలుగు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్‌ రెహమాన్‌ను నియ మించ‌డంతో గొడ‌వ రాజుకుంది.

రెహమాన్‌ నియామకాన్ని తట్టుకోలేని వాసుపల్లి గణేష్‌ అతను అధ్యక్షుడిగా ఉండగా తాను పార్టీ కార్యాలయంలో అడుగేపెట్టనని శపథం చేశాడు. అంతేకాదు.. అప్పటినుంచి కార్యాలయంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. తాజా ఎన్నిక‌ల్ల ద‌క్షిణ సీటును రెహ్మ‌న్ త‌న‌కు లేదా త‌న భార్యకు ఇవ్వాల‌ని బాబుపై ఒత్తిడి చేశారు. అయితే బాబు గ‌ణేష్‌కే తిరిగి సీటు ఇచ్చి.. ఆయ‌న్ను న‌గ‌ర పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి ఆ ప‌ద‌వి రెహ్మ‌న్‌కు ఇచ్చారు. ఇక గ‌ణేష్‌ పార్టీ స‌మావేశాల‌కు రాక‌పోవ‌డంతో.... ఈ అంశం ఆధారంగా ఎమ్మెల్యే వాసుపల్లితో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ నగర అధ్యక్షుడు రెహమాన్‌ భావిస్తున్నారు.

ఈ మేరకు షోకాజ్‌ నోటీసులిచ్చేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ హయాంలో మంత్రిగా అధికారం చె లాయించిన గంటా శ్రీనివాసరావు సైతం.. ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ వ్య వహారాలను అసలు పట్టించుకోవడమే మానేశారు. ఎన్నిక‌ల్లో విశాఖ నగరంలో చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మొక్కుబడిగా అసెంబ్లీకి హాజర వుతున్న శాసనసభ్యులు.. నగరంలోని టీడీపీ కార్యాలయానికి మాత్రం వెళ్ల‌డంలేదు.

కాగా మూడు నెల లుగాపార్టీ కార్యాలయ మెట్లెక్కని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు పార్టీ నియమావళి ప్రకారం నోటీసులివ్వాలని అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు రెహమాన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ నియమావళి ప్రకారం క్రియాశీలక సభ్యత్వం కలిగిన వారు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే నోటీసులివ్వవచ్చని, ఆ క్రమంలో సంజాయిషీ అడగాలని రెహమాన్‌ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఇక్కడ వాసుపల్లి వ్యవహారంతో పాటు పార్టీ కార్యాలయ నిర్వహణ భారం, దుస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లాలని, ఈలోగానే వాసుపల్లికి నోటీసులివ్వాలని రెహమాన్‌ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా ఈ మొత్తం వ్య‌వ‌హారంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమ‌యంలో ప‌డ్డాయి.