Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్ర... భయపడుతున్న టీడీపీ క్యాడర్

By:  Tupaki Desk   |   29 Nov 2022 5:30 PM GMT
లోకేష్ పాదయాత్ర... భయపడుతున్న టీడీపీ క్యాడర్
X
నారా లోకేష్ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కుమారుడు. ఈ విషయంలో టీడీపీ అంతా ఆయన్ని గౌరవిస్తుంది. అభిమానిస్తుంది. అయితే ఆయనే తెలుగుదేశం పార్టీ హోల్ మొత్తానికి భావి వారసుడిని అంటే మాత్రం అదే పార్టీలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తాయని అంటున్నారు. లోకేష్ ఇంకా రుజువు చేసుకోవాల్సి ఉంది అన్నదే పార్టీ వారి మాట.

ముందు తాను గెలవాలి. ఆ తరువాత తన నాయకత్వ లక్షణాలతో జనాలను గెలవాలి. ఆ మీదట పార్టీని గెలిపించాలి. ఇదీ జరగాలి. అయితే లోకేష్ తానుగా మంగళగిరిలో ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి ఆయన ఒక్క చిక్కని గెలుపుని కూడా అందుకోకుండా తనకంటూ ఏ రకమైన ఇమేజ్ లేకుండా కేరాఫ్ చంద్రబాబు అన్న ట్యాగ్ తో ఇపుడు పాదయాత్ర అంటే అది పార్టీకి కచ్చితంగా ఈ కష్టకాలంలో తీరని నష్టాన్నే కలిగిస్తుంది అన్నదే టీడీపీని దశాబ్దాలుగా నమ్ముకున్న వారి మాట.

ఇక లోకేష్ పాదయాత్ర చేయడం సంగతి అలా ఉంచితే ఇప్పటిదాకా పాదయాత్ర చేసిన వారికి క్రేజ్ ఇమేజ్ చాలా ఉంది. వైఎస్సార్ పాదయాత్ర చేశారు అంటే ఆయన అప్పటికి మూడు దశాబ్దాలుగా రాజకీయంగా రాటుదేలారు. పార్టీ పదవులతో పాటు అధికార మంత్రి పదవులు ఎన్నో చేపట్టారు. అనేక సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా ఒంటి చేత్తో గెలిచి కాంగ్రెస్ లో తనకంటూ ఒక ప్రతిష్టను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత పాదయాత్ర అంటే అది సంచలనం రేపింది.

చంద్రబాబు పాదయాత్ర చేశారు అంటే ఆయన కూడా ఆనాటికి రెండు సాలు సీఎం గా చేసి రాజకీయంగా ఢక్కామెక్కీలు ఎన్నో తిన్న నేతగా ఉన్నారు. అందుకే ఆయన పాదయాత్ర అంటే జనాలు వెంటబడ్డారు. జగన్ విషయం తీసుకున్నా ఆయన మేరు పర్వతం లాంటి కాంగ్రెస్ ని సోనియా గాంధీని ఎదిరించి జనాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ సహా విపక్షాలను ఎదుర్కొనే క్రమంలో జైలు పాలు అయ్యారు. జైలు నుంచి వచ్చాక అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడి జస్ట్ లో చాన్స్ మిస్ అయ్యారు. కానీ అత్యధిక ఓట్ల శాతం, 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు.

ఇదంతా ఆయన నాయకత్వ విజయాలుగా జనాలు చూశారు. ఆదరించి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. కానీ లోకేష్ విషయంలో అలాంటి విజయాలు ఏవీ లేవు. ఆయన ఇంకా గెలవాల్సింది ఎంతో ఉంది. కానీ సడెన్ గా పాదయాత్ర అంటూ స్టార్ట్ చేశారు. దీని వల్ల టీడీపీకి ఎంత వరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ కచ్చితంగా అధికార వైసీపీకి లాభం చేకూర్చే చర్యగానే అంతా చూస్తున్నారు.

అలా ఎందుకంటే వైసీపీ సర్కార్ మీద వచ్చిన వ్యతిరేకత చంద్రబాబుకు ఈ టైంలో బాగా కలసివస్తుంది. ఆయన ముమ్మారు సీఎం గా పనిచేసి ఉన్నారు. మంచి అనుభవం కలిగిన వారు, రాష్ట్రాన్ని గాడిలో పెడతారు అని కూడా జనాలు నమ్ముతారు. అలాంటిది లోకేష్ రేసులోకి వస్తే జగన్ ముందు తేలిపోవడమే కాకుండా టీడీపీకి కూడా మైనస్ అవుతారు అని అంటున్నారు.

అందువల్ల అన్ని విధాలుగా ఆలోచిస్తే ఈసారికి చంద్రబాబు ఫేస్ తోనే ఎన్నికలకు వెళ్ళడం టీడీపీకి ఎంతో ఉత్తమం అని అంతా అంటున్నారు. బాబు వల్ల టీడీపీ ఈసారికి గట్టెక్కితే ఆ మీదట పార్టీ నిలబడుతుంది. ఆ తరువాత లోకేష్ తానుగా రుజువు చేసుకుంటే పార్టీ మరింతంగా నిలబడే చాన్స్ ఉంటుంది. లెక్క ఇలా ఉంటేనే టీడీపీ సూపర్ హిట్ అవుతుంది అని అంటున్నారు.

ఇపుడు వైసీపీ మీద జనాలకు ఉన్న యాంటీతో చంద్రబాబు మీదనే అతి పెద్ద హోప్స్ ని అంతా పెట్టుకున్నారు. ఈ కీలక దశలో మళ్ళీ లోకేష్ ని ముందు పెడితే అది వ్యూహాత్మకమైన తప్పిదమే అవుతుంది అని అంటున్నారు. లోకేష్ ని ఫోర్ ఫ్రంట్ లోకి తీసుకుని వస్తే వైసీపీ సర్కార్ యాంటీ ఓట్లు మారే చాన్స్ ఉంది అంటున్నారు. ఇక ఇప్పుడు కనుక టీడీపీ ఓడిపోతే మళ్లీ ఎపుడూ గెలిచే పరిస్థితి కూడా కనిపించడంలేదు అని క్యాడర్ భయపడుతోందిట.

అందువల్ల ఈసారికి లోకేష్ ని పక్కన పెట్టి చంద్రబాబు ఫేస్ తోనే ఈ ఎన్నికాలను ఎదుర్కొంటేనే టీడీపీకి అన్ని విధాలుగా మేలు చేకూరుతుంది అని అంటున్నారు. అలా కాకుండా లోకేష్ ని కనుక ముందు పెడితే టీడీపీ చాప్టర్ క్లోజ్ అని అదే పార్టీలో ఒక వర్గం గట్టిగా నమ్ముతోందిట. మరి దీని మీద కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి కచ్చితంగా చంద్రబాబే. ఎందుకంటే ఆయనకు ఇవన్నీ తెలియనివి కాదు. కానీ వత్తిడులు ఏమైనా ఉంటే వాటిని కూడా దటుకుని ముందుకు వచ్చే వారే నాయకులు. అలా బాబు చేయాలనే క్యాడర్ కోరుకుంటోందిట



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.