Begin typing your search above and press return to search.

వైఎస్ కుటుంబానికి జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త ఇవ్వాలంటున్న టీడీపీ నేత‌!

By:  Tupaki Desk   |   1 July 2022 11:30 AM GMT
వైఎస్ కుటుంబానికి జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త ఇవ్వాలంటున్న టీడీపీ నేత‌!
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలా? వారి కుటుంబానికి ముప్పు పొంచి ఉందా అంటే అవున‌నే అంటున్నారు.. రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి. ఈ మేర‌కు వైఎస్ కుటుంబంలో ఉన్న‌వారంద‌రికీ జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు విజ్ఞ‌ప్తి చేశారు.

వైఎస్ కుటుంబానికి జెడ్ కేటగిరీ భద్ర‌త ఎందుకో కూడా ఆనం వెంక‌ట ర‌మ‌ణారెడ్డి చెబుతున్నారు. ఎందుకు తాను కేంద్ర హోం మంత్రికి విన్న‌వించిందో కూడా వివ‌రిస్తున్నారు. గ‌త ఎన్నికలకు ముందు వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసి ఆ నిందను టీడీపీపై నెట్టారని ఆనం గుర్తు చేస్తున్నారు. ఆ సానుభూతితో ఎన్నిక‌ల్లో గెలిచార‌ని అంటున్నారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయ‌ని.. మ‌ళ్లీ ఇప్పుడు ఎవరిని ఎవరు చంపుతారోనన్న అనుమానం కలుగుతోంది అంటూ ఆనం వెంక‌ట ర‌మ‌ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒకవేళ వైఎస్ కుటుంబ స‌భ్యుల‌కు ఏదైనా జరిగితే దాన్ని మ‌ళ్లీ టీడీపీ మీద‌కు నెడ‌తార‌ని చెబుతున్నారు. వైఎస్‌ రాజశేఖర‌రెడ్డిది ప్రమాదం కాదు హత్య అని గతంలో కొంతమంది ఆరోపించారని.. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ విష‌యం మీద ఒక్క సిట్ కూడా వేయలేదని గుర్తు చేశారు.

ప్రజలు కోరుతున్న‌వి చేయకుండా వైఎస్సార్సీపీ నేత‌లు ఏవేవో మాట్లాడుతున్నారని ఆనం వెంక‌ట‌ రమణారెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా స‌మ‌స్య‌ల‌ను వైఎస్సార్సీపీ నేత‌లు ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని.. ఇకనైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

అవినీతిని అదుపు చేసి.. రౌడీయిజానికి స్వస్తి పలకాల‌ని కోరారు. శ్రీకాళహస్తిలో ఆలయం దగ్గర ఒక మీడియా ప్ర‌తినిధిని వైఎస్సార్‌సీపీ నాయకుడు కొట్టడం చూశానని.. వైఎస్సార్సీపీ పాల‌న ఇంత దారుణంగా ఉంద‌న్నారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపైనా దాడులు చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు.

ఇక‌ ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంలో ఉండాల్సినవి లేవు.. ఉండకూడనివి మాత్రం ఉంటున్నాయి అని ఆనం వెంక‌ట రమ‌ణారెడ్డి విమర్శించారు. తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకోకుండా వైఎస్సార్సీపీ నేత‌లు టీడీపీ నేత‌ల‌పై దాడికి దిగుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.