Begin typing your search above and press return to search.

ప్ర‌జా వేదిక : అవే గాయాలు..మూడేళ్ల‌యినా వెన్నాడుతున్నాయే!

By:  Tupaki Desk   |   25 Jun 2022 10:30 AM GMT
ప్ర‌జా వేదిక : అవే గాయాలు..మూడేళ్ల‌యినా వెన్నాడుతున్నాయే!
X
వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కృష్ణా న‌దిపై అక్ర‌మ కట్ట‌డం అంటూ ప్రజా వేదిక‌ను కూల్చింది. ఈ ఘ‌ట‌న జ‌రిగి మూడేళ్లు..ఈ మూడేళ్ల ఒక్క‌టంటే ఒక్క నిర్మాణం అయినా చేప‌ట్టిందా అని ప్ర‌శ్నిస్తోంది టీడీపీ. ఈ నేప‌థ్యంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్ జ‌గ‌న‌న్న కూల్చివేత‌లు అంటూ ఓ పెద్ద లిస్టునే తెర‌పైకి తెచ్చింది. ఇక ప్ర‌జావేదిక కూల్చివేత త‌రువాత అదే స్పీడుతో కృష్ణా న‌ది క‌ర‌క‌ట్ట‌ల‌పై ఉన్న అన్ని అక్ర‌మ క‌ట్ట‌డాల‌నూ కూల్చివేస్తామ‌ని బీరాలు ప‌లికింది. రాగాలు తీసింది. కానీ అవేవీ సాధ్యం కాలేదు. ఆరోజు కొంద‌రు బీజేపీ ప్ర‌ముఖుల ఇళ్లు, ప్ర‌కృతి ఆశ్ర‌మాలు (మంతెన సత్య‌నారాయ‌ణ రాజు) వంటివి కూడా కూల్చేస్తామ‌ని, చ‌ట్టం ముందు అంతా స‌మాన‌మేన‌ని చెప్పింది వైసీపీ. నా ఇల్లు అక్ర‌మ నిర్మాణంలో భాగంగా ఉన్నా కూడా అధికారులు బుల్డోజ‌ర్ల‌తో కూల్చేయ‌వ‌చ్చు అని యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అప్ప‌ట్లో అన్నారు.

ఈ సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు ఏమ‌న్నారంటే ..

"తన పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేత. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ... తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం వివరించి నేటికి మూడేళ్లు. డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలే. ఏపీ అభివృద్ధిని కూల్చారు. రాష్ట్ర ఆర్థిక స్థాయిని కూల్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చారు. దళితుల గూడును, యువత భవితను కూల్చారు. ప్రజా రాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్...మూడేళ్లలో కట్టింది మాత్రం శూన్యం. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ....తన వల్ల ఏమీ కాదని...తనకు ఏమీ రాదని తేల్చి చెప్పేశారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాత అయినా జగన్ తెలుసుకోవాలి" అని అన్నారాయ‌న.


ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్ ...

అటుపై అన్నా క్యాంటీన్ల‌ను కూడా ఆపేశారు. కొన్నింటిని కూల్చేందుకు ప్ర‌య‌త్నించి త‌రువాత వ‌ద్ద‌నుకుని, వాటిని గ్రామ స‌చివాలయాలుగా మార్చారు అన్న‌ది టీడీపీ మాట‌. పేద‌వారికి ఐదు రూపాయ‌ల‌కే అన్నం పెట్టే బృహ‌త్త‌ర ప‌థ‌కాన్ని ఇస్కాన్ (ప్ర‌ముఖ ఆధ్యాత్మిక సంస్థ‌) సంస్థ సాయంతో చేయాల‌నుకున్నారు. ఆ విధంగా న‌గ‌రాల్లో ముఖ్య కూడ‌ళ్ల‌లో ఏర్పాటుచేశారు. కొద్ది రోజులు న‌డిచాక టీడీపీ స‌ర్కారు అధికారం కోల్పోయింది.

వెంటనే అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ వీటిని ఆపేయాల‌ని హుకుం జారీ చేశారు. ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్ల కోసం టీడీపీ పోరాడుతోంది. ఆఖరికి నాయ‌కులు త‌మ సొంత డ‌బ్బుల‌తో ఈ క్యాంటీన్ల‌ను నిర్వ‌హించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇవే కాకుండా టీడీపీని ఉద్దేశించి ప‌లు విధ్వంసాల‌కు వైసీపీ పాల్ప‌డింది అని సంబంధిత బాధిత వ‌ర్గాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్ల స్థానంలో వైసీపీ నాయ‌కులు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్ లో హోట‌ళ్లుగా వాటిని మార్చుకుని డ‌బ్బులు దండుకున్నార‌ని కూడా టీడీపీ అంటోంది.

టీడీపీ చెబుతున్న విధంగా వైసీపీ చేప‌ట్టిన కూల్చివేత‌ల వివ‌రాలివే..

* ప్రజా వేదిక (అమ‌రావ‌తి)
* రుషికొండ (విశాఖ ప‌ట్నం)
* మూడు లాంతర్ల కట్టడం (విజ‌య‌న‌గ‌రం)
* గుంటూరులో అమ్మవారి ఆలయం
* సబ్బం హరి ఇల్లు (విశాఖ జిల్లా)
* అయ్యన్న ఇల్లు (విశాఖ జిల్లా)
* పల్లా శ్రీనివాస్ ఇల్లు (విశాఖ జిల్లా)
* విశాఖలో Fusion Foods
* గంటా అనుచరుడుగా ఉన్న కాశీ విశ్వనాథకు చెందిన గో-కార్టింగ్‌
* గీతం యూనివర్సిటీ
* శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంజనేయస్వామి గుడి
* వైజాగ్ లోని APTDC resort
* Vizag MVP కాలనీలో హెడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థ షెడ్డు
* ప్రకాశం బ్యారేజి సమీపంలో ఉన్న విజయేశ్వర స్వామి గుడి
* మంగళగిరిలో ఇళ్ళ కూల్చివేత
* ఎన్టీఆర్ విగ్రహం కూల్చి వేత
* ఆంధ్రజ్యోతి విశాఖలో పత్రికా ముద్రణకేంద్రం కూల్చివేత
* డొక్కా సీతమ్మ నిత్య అన్నదాన శిబిరం కూల్చివేత