Begin typing your search above and press return to search.

రాజీవ్‌ గాంధీ కేసులో సుప్రీం సంచలన తీర్పు.. పెరారివలన్‌ విడుదల

By:  Tupaki Desk   |   18 May 2022 8:56 AM GMT
రాజీవ్‌ గాంధీ కేసులో సుప్రీం సంచలన తీర్పు.. పెరారివలన్‌ విడుదల
X
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో మే 18న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గత 31 ఏళ్లుగా తమిళనాడుల్లోని జైల్లో మగ్గుతున్న పెరారివలన్‌కు విముక్తిని ప్రసాదించింది. ఈ మేరకు అతడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1991లో మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్‌ గాంధీని లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టీటీ ఈ) తీవ్రవాదులు మానవ బాంబుతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రాజీవ్‌ గాంధీతోపాటు మరో 14 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రాజీవ్‌గాంధీ హత్యకు సహకరించిన మొత్తం ఏడుగురికి కోర్టు ఉరి శిక్ష విధించింది. తర్వాత దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఏడుగురిలో పెరారివలన్‌ కూడా ఉన్నాడు. పేలుడు పరికరాలను సరఫరా చేసినందుకు ఈయనకు కోర్టు శిక్ష వేసింది.

అప్పటి నుంచి తమిళనాడులోని పూళన్‌ జైల్లో పెరారివలన్‌ మగ్గుతున్నాడు. ఈ ఏడాది మార్చిలో తన భార్యను కలుసుకోవడానికి పెరోల్‌ ఇప్పించాల్సిందిగా పెరారివలన్‌ తమిళనాడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసింది.

కోర్టు విధించిన జీవిత ఖైదు తమకు ఎప్పుడో ముగిసిందని కాబట్టి తమను జైలు నుంచి విడుదల చేయాలని ఏడుగురు నిందితులు ఒక్కొక్కరు వరుసగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెరారివలన్‌ సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

ఇందులో భాగంగా మే నెల మొదటి వారంలోనే సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరారివలన్‌ విడుదల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. ఏ విషయాన్ని మే 10 లోగా తేల్చాలని అప్పట్లోనే డెడ్‌లైన్‌ విధించింది.

దీంతో తమిళనాడు శాసనసభ రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలని తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. అయితే గవర్నర్‌ తాను సంతకం చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టుకు పంపడానికి జాప్యం చేశారు. దీంతో పెరారివలన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు అతడిని కేసు నుంచి విముక్తుడిని చేస్తూ మే 18న నిర్ణయం వెలువరించింది.