Begin typing your search above and press return to search.

గంభీర్ కి షాకిచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   27 July 2021 12:30 AM GMT
గంభీర్ కి షాకిచ్చిన సుప్రీం
X
కరోనా తో మన దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఈ కష్టాలన్నీ పేద వారికే.. పెద్ద వారు ఏ మాత్రం సఫర్ కాలేదని వాదించే వారు కూడా ఉన్నారు. కానీ చాలా మంది ఈ వాదనతో ఏకీభవించలేదు. పేద వారైనా, ధనవంతులైనా కోవిడ్ అందరినీ సమానంగా ట్రీట్ చేసిందని తెలుపుతున్నారు. కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ నరకం చూశారని పేర్కొంటున్నారు. కానీ ఇదే సమయంలో కొంత మంది బడా రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు తమ వద్ద కరోనాతో ప్రాణాలు పోయే పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్న చివరి ఘడియల్లో అవసరమైన మందులను నిల్వ చేసుకున్నారు. అలానే బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఫాబీ ఫ్లూ లాంటి అనేక మందులను స్టోర్ చేశాడు.

దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హై కోర్టు గంభీర్ ను ఈ విషయంలో విచారించాలని తన నిర్ణయాన్ని వెలువరించింది. హై కోర్టు నిర్ణయంతో ఏకీభవించని గంభీర్ హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ... సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కానీ సుప్రీం కోర్టు కూడా ఈ విషయంపై విచారణ జరిపి గంభీర్ పై విచారణ జరపాలన్న ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యలనే సమర్ధించింది. గంభీర్ ను ప్రాసిక్యూట్ చేయకుండా సుప్రీం కోర్టు అడ్డుకోవడం సాధ్యపడదని జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ షాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవసరమనుకుంటే ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.

ఈ కేసు విషయంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ.... ప్రాణా పాయ స్థితిలో బంధువులు, అయిన వారు ఉండగా మందుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మందులు దొరక్కుండా చేయడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. ఇలా న్యాయ మూర్తులు మందులను నిల్వ ఉంచుకోవడాన్ని తప్పుబట్టారు. అందుకు గౌతీ ఒప్పుకోలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రజల కొరకు మందులను సేకరించినట్లు తెలిపాడు. అయినా కానీ గంభీర్ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం ఆయనను తప్పని సరిగా ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే తీర్పు ఢిల్లీ హై కోర్టు వెలువరించగా.... అసహనంతో గంభీర్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా గౌతమ్ గంభీర్ ను విచారించాల్సిందేనని ఢిల్లీ హై కోర్టు మాదిరే తీర్పు వెలువరించడం గమనార్హం.

క్రికెటర్ గా ఉన్నపుడు కూడా గౌతమ్ గంభీర్ తరుచూ అందరితో వివదాలు పెట్టుకునే వాడు. చాలా మంది క్రికెటర్లు గౌతమ్ గంభీర్ ను కొట్టడానికి రాగా... సహచర క్రికెటర్లు ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ గంభీర్ తన దూకుడు స్వభావాన్ని ఏ మాత్రం తగ్గించుకోలేదు. ఇలా హై కోర్టు, సుప్రీం కోర్టు ఒకే రకమైన తీర్పులను ఇవ్వడంతో ప్రస్తుతం గంభీర్ ఏం చేస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ ఎంపీ అయినా కూడా గంభీర్ కు తిప్పలు తప్పడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.