Begin typing your search above and press return to search.

పెగాసస్ సై సుప్రీం చీఫ్ జస్టిస్ రమణ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   23 Sep 2021 1:30 PM GMT
పెగాసస్ సై సుప్రీం చీఫ్ జస్టిస్ రమణ సంచలన నిర్ణయం
X
దేశంలోని రాజకీయ ప్రముఖులు, ప్రత్యర్థి పార్టీల వారు, జర్నలిస్టులు, మేధావులు సహా చాలా మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్ వేర్ తో ఈ పనిచేశారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం దేశాన్ని కుదిపేసింది. తీవ్ర వివాదానికి దారితీసిన ఈ పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసస్ పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీకి సంబంధించి వచ్చేవారం ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

భారత పౌరులపై నిఘా కోసం ఇజ్రాయెల్ స్పైవేర్ ‘పెగాసస్’ను కేంద్రప్రభుత్వం ఉపయోగించిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఈ పరిణామం కేంద్రానికి షాకింగ్ గా మారింది. దేశ భద్రతకు సంబంధించిన విషయం అని.. దీనిపై వివరాలు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా దీన్ని నిగ్గుతేల్చేందుకు కమిటీ వేయడం సంచలనమైంది.

ఇజ్రాయేల్ సాఫ్ట్ వేర్ ‘పెగాసస్’ను తమ ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయో లేదో బహిరంగ పరచడానికి కేంద్రప్రభుత్వం నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసులో తీర్పును సెప్టెంబరు 13న రిజర్వ్ చేసింది. గత విచారణలో కేంద్రం పెగాసస్ వినియోగంపై సమాచారం పంచుకోవడానికి.. నిర్ధిష్ట సమాచారం అందజేయడానికి నిరాకరించింది.

ఈ క్రమంలోనే న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం.. న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేయడం.. స్వతంత్ర విచారణకు సంబంధించిన ఇతర అనుబంధ అంశాలపై రాబోయే 3-4 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయనుంది. అయితే కేంద్రం మాత్రం పెగాసస్ పై ఆగస్టు 16న ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.

మంత్రులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్ లను హ్యాక్ చేయడానికి మిలటరీ గ్రేడ్ స్పైవేర్ ను ఉపయోగించడాన్ని కేంద్రప్రభుత్వం తన అఫిడవిట్ లో ధ్రువీకరించలేదు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కేంద్రానికి శరాఘాతం కానుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పెగాసస్ వ్యవహారంలో ఏకంగా సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంచలనమైంది.