Begin typing your search above and press return to search.

ఆటలో అరటిపండులా సుజనా - సీఎం రమేశ్ - టీజీ

By:  Tupaki Desk   |   24 Feb 2020 6:30 PM GMT
ఆటలో అరటిపండులా సుజనా - సీఎం రమేశ్ - టీజీ
X
వ్రతం చెడ్డా ఫలితం దక్కని చందంగా మారిందట ఈ బీజేపీ ఎంపీల పరిస్థితి.. చంద్రబాబు దారుణ ఓటమి.. కేసుల భయం.. కాంట్రాక్టుల కోత వంటి కారణాలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీలోకి వలస వెళ్లారు టీడీపీ మాజీ ఎంపీలు సుజనాచౌదరి - సీఎం రమేష్ - టీజీ వెంకటేశ్ లు.. చంద్రబాబు సాగనంపి మరీ బీజేపీలో చేర్పించేశారన్న అపవాదు ఉంది.

అయితే ఇప్పుడు బీజేపీలో చేరినా ఈ టీడీపీ మాజీ ఎంపీల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైందట.. వారు ఇప్పుడు డమ్మీలు అయిపోయి అసంతృప్తిగా ఉన్నారట.. ఏపీ గురించి బీజేపీ తీసుకునే ఏ నిర్ణయాల్లోనూ వీరిని విస్మరిస్తున్నారట.. ఏ సమస్యపైనా వీరిని బీజేపీ పెద్దలు కనీసం సంప్రదించడం లేదట.... పరిగణలోకి తీసుకోకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారట..

ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఏపీ బీజేపీ కీలక వ్యూహ సమావేశంలో ఈ ముగ్గురు బీజేపీ ఎంపీలు సుజనా - సీఎం రమేశ్ - టీజీ వెంకటేశ్ లను అసలు ఆహ్వానించలేదట.. వీరు ఆ సమావేశంలోనూ కనిపించలేదు. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ - జీవీఎల్ - పురంధేశ్వరిలు కీలక పాత్ర పోషించారు.

నిజానికి వీరు ముగ్గురు బీజేపీలో చేరినా ఇంకా చంద్రబాబుతో సాన్నిహిత్యంగా ఉంటున్నారని.. బాబు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని బీజేపీ అనుమానిస్తోంది. బీజేపీలో ఉన్నా కూడా అమరావతి - మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరినే తీసుకొని అనుకూలంగా మాట్లాడారు. ఇది బీజేపీని కలవరపెట్టింది.

ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జనసేన - బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. కానీ ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ లో ముగ్గురు ఎంపీలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వీరిని కావాలనే పక్కనపెడుతోందన్న చర్చ సాగుతోంది.దీనికి వీరు అప్ సెట్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.