Begin typing your search above and press return to search.

ఇంత నీచమైన రోత దాడి ఏపీకి క్షేమం కాదు

By:  Tupaki Desk   |   30 Sep 2022 2:29 AM GMT
ఇంత నీచమైన రోత దాడి ఏపీకి క్షేమం కాదు
X
రాజకీయాలు ఎందుకు? ప్రజల్ని ఉద్దరించటానికేగా? వారి బాగోగులు చూసుకుంటే.. వారి జీవన ప్రమాణాల్ని మరింత మెరుగుపర్చటానికే కదా? భావితరాలకు మంచి చేయకున్నా ఫర్లేదు.. చెడు మాత్రం చేయకూడదు. కానీ.. ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయం.. రోజులు గడిచే కొద్దీ అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తుంటే.. ఇంతటి వికారమైన రాజకీయాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవనిపించక మానదు. తమిళనాడులో కరుణ - జయ మధ్య రాజకీయ శత్రుత్వం ఉంది. కానీ.. ఎవరూ కూడా తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి.. వారి ఇంట్లో కుటుంబ సభ్యుల మర్యాదను దెబ్బ తీసేందుకు సాహసించేవారు కాదు.

కానీ.. వైసీపీకి చెందిన కొందరు మాత్రం ఆ గీతల్ని అడ్డదిడ్డంగా చెరిపేస్తూ.. రాజకీయ ప్రత్యర్థిని వ్యక్తిగత శత్రువుగా మార్చుకునే కొత్త పద్దతికి తెర తీస్తున్నట్లుగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు.. ఆయనకు చెందిన తెలుగు దేశం పార్టీ విధానాల్ని తిట్టటం.. తప్పు పట్టటం.. గేలి చేయటం వరకు సర్దుకోవచ్చు. కానీ.. రాజకీయం పేరుతో ఇంట్లోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. బాధ పడేలా చేయటంలో అర్థం లేదు.

తాజాగా విజయవాడలో వెలిసిన రోత పోస్టర్లు చూస్తే.. దరిద్రపుగొట్టు రాజకీయం కోసం మరీ ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం కలగొచ్చు. ఇక్కడ మర్చిపోకూడని పాయింట్ ఏమంటే.. అధికారం ఎవరికి శాశ్వితం కాదు. 20 ఏళ్లు కాదంటే 30 ఏళ్ల తర్వాత అయినా అధికారం నుంచి పక్కకు జరగాల్సిందేగా? అది ప్రకృతి ధర్మం. దానికి ఎవరూ అతీతులు కాదు. అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి మన వెంటే వస్తుంది. కానీ.. చెడు మాత్రం అందరిని అంటుకుంటుంది.

రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా ట్రీట్ చేయటం.. వారిని దెబ్బ తీయటం కోసం సభ్య సమాజం హర్షించని రీతిలో ఇష్టారాజ్యంగా దాడి చేయటం కొంత వినోదంగా అనిపించొచ్చు. అవతలవాడి నిస్సహాయతను నవ్వుకోవచ్చు. కానీ.. ఆ తర్వాత దానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది కదా? తప్పు ఎవరు చేసిన తప్పు పట్టాల్సిందే. అలాంటి తీరు సరికాదని సర్ది చెప్పాల్సిందే. అది వదిలేసి.. తోచినట్లుగా వ్యవహరిస్తే.. ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు ఎవరికి వారు సమాధి చేసినట్లే అవుతుంది.

రాజకీయ వైరాన్ని వ్యక్తిగతానికి తీసుకొని.. దాన్ని దారుణ రీతిలో టార్గెట్ చేయటం ఇప్పటికైతే బాగుండొచ్చు. కానీ.. రోజులు గడిచే కొద్దీ.. అది పెరిగి పెద్దది కావటం.. ఆ తర్వాత తమకు అవకాశం చిక్కినప్పుడు మరింత వికారంగా.. అంతకు మించిన రోతగా వ్యవహరిస్తే.. జరిగే నష్టం పార్టీల కంటే కూడా.. ఏపీ ప్రజలకు.. ఏపీ సమాజానికి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. రోత పోస్టుల్ని ప్రోత్సహించే వారిని.. వాటిని పెట్టే వారిని మొదటే తీవ్రంగా హెచ్చరించి..

హద్దుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.