Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసంలో చంచ‌ల్ గూడ జైలుకు సుబ్బారావు

By:  Tupaki Desk   |   26 Jun 2022 6:30 AM GMT
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసంలో చంచ‌ల్ గూడ జైలుకు సుబ్బారావు
X
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో ప్ర‌ధాన సూత్రధారి సాయి డిఫెన్స్‌ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావుతోపాటు ముగ్గురు ప్రధాన అనుచరులు మల్లారెడ్డి, శివకుమార్, బీసిరెడ్డిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరు అల్లర్లకు కారణమైన వాట్సాప్‌ గ్రూపులను డిలీట్‌ చేయడం, ఆధారాలను తుడిచేయడం వంటి ప్రయత్నాలు చేశార‌ని రైల్వే పోలీసులు చెబుతున్నారు. దీంతో నిందితులపై అదనపు సెక్షన్లు కింద కేసులు న‌మోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 67 మంది నిందితులను గుర్తించగా సుబ్బారావును 64 నిందితుడిగా చేర్చారు. ఆవులతోపాటు మరో ముగ్గురు నిందితులను రైల్వే కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌కు చెందిన ఆవుల సుబ్బారావు గ‌తంలో ఆర్మీలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పని చేశాడు. 2011లో సర్వీసు నుంచి బయటకు వచ్చిన సుబ్బారావు 2014లో నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. శిక్ష‌ణ ఇచ్చే ముందే అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల‌ను త‌న‌ వద్ద పెట్టుకొని.. ఉద్యోగం వచ్చాక రూ. 3 లక్షలు చెల్లించేలా ఒప్పందం రాయించుకునేవాడు. ఇలా భారీ మొత్తం ఆర్జించేవాడు.

అయితే 2019 చివ‌ర నుంచి కరోనా వ్యాప్తి మొదలవడంతో ఆర్మీ రాత పరీక్ష ప‌లుమార్లు వాయిదా ప‌డింది. దీంతో సుబ్బారావు అకాడ‌మీల్లాంటివి బాగా న‌ష్ట‌పోయాయి. క‌రోనా త‌గ్గాక మ‌ళ్లీ కుదుట‌ప‌డుతున్నాయ‌నుకునే లోప‌లే కేంద్ర ప్ర‌భుత్వం ఈ నెల 14న అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించింది.

ఇక ఆర్మీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోమ‌ని తెల‌ప‌డంతో సుబ్బారావుతోపాటు ఇత‌ర అకాడ‌మీల నిర్వాహ‌కులు ఆందోళ‌న చెందారు. ఇలా అయితే త‌మ‌కు భారీ న‌ష్టం వ‌స్తుంద‌ని భావించారు.

ఇదే స‌మ‌యంలో కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ హరియాణా, యూపీ, బిహార్‌లలో భారీ సంఖ్యలో అభ్యర్థులు రోడ్డెక్కి హింసకు పాల్పడ్డారు. దీంతో సుబ్బారావు కూడా అభ్యర్థులను రెచ్చగొట్టి హింసాత్మక ఆందోళనలను తెలుగు రాష్ట్రాల్లోనూ చేద్దామంటూ పిలుపునిచ్చాడు. తన అనుచరులతోపాటు ఆర్మీ అభ్యర్థులతో వివిధ పేర్లతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయించాడు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరసనలకు వచ్చేటప్పుడే కర్రలు, రాడ్లు, పెట్రోల్‌ తీసుకురావాలని మేసేజ్ పెట్టించాడు. నిరసనల్లో పాల్గొనే అభ్యర్థులకు ఆర్థిక సాయం సహా ఇతర సహాయ సహకారాలు అందించాలంటూ తన అనుచరులైన మల్లారెడ్డి, బీసి రెడ్డిలకు సూచించాడు.

విధ్వంసం జరిగిన జూన్ 17న‌ మల్లారెడ్డి, శివ రైల్వేస్టేషన్‌ వద్దే ఉన్నారు. హైద‌రాబాద్ బోడుప్పల్‌లోని ఒక‌ హోటల్‌లోనే ఉండిపోయిన సుబ్బారావు ఫోన్ ల తన అనుచరుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత నరసరావుపేటకు పారిపోయిన సుబ్బారావు అక్కడనుంచీ పరిస్థితుల్ని తెలుసుకుంటూ వ‌చ్చాడు. బీసిరెడ్డి, మల్లారెడ్డి, శివకు ఫోన్లు చేసి వాట్సాప్‌ గ్రూపుల్ని డిలీట్‌ చేయాలని ఆదేశించాడు. తాను ఉన్న ‘హకీంపేట’గ్రూపు నుంచి తప్పుకున్నాడు. సుబ్బారావుతో పాటు బీసిరెడ్డి, మల్లారెడ్డి, శివ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయాలని చూశారు. దీంతో వారిని తాజాగా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.