Begin typing your search above and press return to search.

బన్నీ సినిమా టైటిల్ ఐదు నెలల ముందే చెప్పేసాడా..?

By:  Tupaki Desk   |   9 April 2020 3:30 PM GMT
బన్నీ సినిమా టైటిల్ ఐదు నెలల ముందే చెప్పేసాడా..?
X
అల్లు అర్జున్ తన కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న సినిమా 'పుష్ప'.. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. నిన్న బన్నీ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో పాటు టైటిల్‌ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో నిన్న అంతా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్టైలిష్ స్టార్ కనిపించాడు. అయితే పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ పోస్టర్ లో బన్నీ ఒక కాలికి ఆరు వేళ్ళు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా ఇప్పుడు 'పుష్ప' టైటిల్ విషయంలో కూడా ఒక వార్త వచ్చింది. వాస్తవానికి గతేడాది నవంబర్‌ లోనే బన్నీ ఈ సినిమా పేరును బయట పెట్టాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు.

2019 న‌వంబ‌ర్ 27న సుకుమార్‌ ని ఉద్దేశిస్తూ బ‌న్నీ చేసిన ట్వీట్‌ ను సాక్షంగా చూపుతున్నారు నెటిజన్స్. అల్లు అర్జున్ టైటిల్ అప్పుడే చెప్పేశాడు... మనమే గుర్తించలేకపోయామంటూ తెగ బాధపడిపోతున్నారు. బన్నీ ట్వీట్ చూస్తే... ‘సుక్కు జుట్టు రంగు మారింది. నా స్కిన్ కలర్ మారింది. కానీ ప్రేమ మాత్రం మారలేదు. మేం కలుసుకున్నప్పుడు ఏదీ మారదు. మీరు త్వరలోనే దీనికి సాక్షుల‌వుతారు’’ అనే మెసేజ్‌ తో పాటు చివ‌ర్లో కొన్ని సింబ‌ల్స్ పెట్టాడు బ‌న్నీ. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఆ సింబ‌ల్స్‌ లోనే 'pushpa' అనే అక్ష‌రాలున్నాయి. మ‌రి అప్ప‌టికి త‌న పాత్ర పేరును అలా రివీల్ చేశాడా.. లేక అప్ప‌టికే టైటిల్ కూడా ఖ‌రారైపోయిందా అన్న‌ది తెలియ‌దు కానీ.. బ‌న్నీ అయితే ముందే సంకేతాలు ఇచ్చేసినా ఎవ్వ‌రూ దాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఇప్పుడు సినిమా టైటిల్ 'పుష్ప' అని తేలడంతో అప్పటి బన్నీ ట్వీట్ కూడా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా క‌థ చిత్తూరు జిల్లా నేప‌థ్యంలో సాగుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ పుష్ప‌రాజ్ - పుష్ప‌కుమార్ అనే పేర్లు బాగానే పాపుల‌ర్. కాబ‌ట్టి హీరో పాత్ర‌కు పుష్ప‌రాజ్ అని పేరు పెట్టి.. వాడుకలో షార్ట్‌ గా హీరోను పిలిచే 'పుష్ప' అనే మాట‌నే టైటిల్‌ గా పెట్టేశారని సమాచారం. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని - వై.ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు. తెలుగు - త‌మిళ‌ - హిందీ - మ‌ల‌యాళ‌ - క‌న్న‌డ భాష‌ల్లో పాన్ ఇండియా చిత్రంగా సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో రష్మిక బన్నీకి జంటగా నటిస్తోంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో అలరించనున్నారు.