Begin typing your search above and press return to search.

అటు ఎండలు.. ఇటు వర్షాలు..: దేశంలో వింత పరిస్థితి

By:  Tupaki Desk   |   17 May 2022 8:37 AM GMT
అటు ఎండలు.. ఇటు వర్షాలు..: దేశంలో వింత పరిస్థితి
X
కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో కూడా వింత వింత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవులు భూమ్మీద వినియోగిస్తున్న కర్భన పదార్థాలతో వాతావరణం కాలుష్యమైపోతుంది. దీంతో వేసవికాలంలో భారీ వర్షాలు.. వర్షా కాలంలో ఊహించని ఎండలు సంభవిస్తున్నాయి. తాజాగా దేశంలో ఓ వైపు మండే ఎండలతో సతమమతవుతుంటే.. మరోవైపు భారీ వర్షాలతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి వింత పరిస్థితితో ముందు ముందు వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈసారి వేసవికాలం ప్రారంభం కాకముందే ఎండవేడి మొదలైంది. జనవరి చివరిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలలో భగ భగ మండే ఎండలు కొడుతున్నాయి. ఇక్కడి ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతన్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయట కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 49 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇక్కడి ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించేసింది.

1944 మే 29 న సఫ్దర్ జంగ్ వెదర్ స్టేషన్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత ఇప్పుడు 49 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఎండ తీవ్రతతో చుట్టు పక్కల ప్రాంతాలన్నీ హీట్ సిటీస్ గా మారాయని అంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడి వేడిని తట్టుకోలేక పిట్టలన్నీ ప్రాణాలు విడుస్తున్నాయి. 45 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇక్కడి పక్షులకు ట్రీట్ మెంట్ చేశామని వెటర్నరీ వైద్యులు పేర్కొంటున్నారు.

ఓ వైపు ఇలా ఎండలు మండుతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి ఏర్పడింది. కుండపోత వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు, రైల్వే ట్రాక్ లు తెగిపోయాయి. చాలా చోట్ల విద్యుత్ వ్యవస్థ ఆగిపోయింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించగానే మరోవైపు భారీ వర్షాలు కురవడం గమనార్హం. గతంలో కంటే ముందుగానే రుతుపవనాలు రావడం వల్ల ఈ వర్షాలు సంభవించాయని అంటున్నారు.

గతంలో వేసవికాలం జూన్ మధ్యలో వరకు సాగి.. ఆ తరువాత చిరుజల్లులు మొదలయ్యేవి. సెప్టెంబర్ చివరి వరకు వర్షాలు పడేవి. కానీ ఈసారి ఉష్ణోగ్రత తీవ్రత కావడంతో వర్షాలు ముందే వచ్చాయని అంటున్నారు. అయితే ఈ వర్షాలు ఒకవైపు మాత్రమేనని, ఉత్తరాదిలో మాత్రం అప్పుడే వర్ష సూచన కనిపించడ లేదని అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.