Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు కోసం రాష్ట్ర బంద్ ...నిలిచిపోయిన బస్సులు , బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతు !

By:  Tupaki Desk   |   5 March 2021 5:45 AM GMT
విశాఖ ఉక్కు కోసం రాష్ట్ర బంద్ ...నిలిచిపోయిన బస్సులు , బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతు !
X
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో ఏళ్లు పోరాటం చేసి దక్కించుకున్న ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేట్ పరం చేయాలనీ చుస్తూండటం తో మరోసారి ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఉక్కు కోసం అన్ని పార్టీలు ఏకమై రోడ్డు మీదకు రావడం విశేషం. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌ ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డీపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసనల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆప్‌, టీఎన్‌ టీయూసీ, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌, ఎస్‌ ఎఫ్‌ ఐ సంఘాలు పాల్గొన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంద్ కొనసాగనుంది. బంద్ సందర్భంగా మద్దిలపాలెంలో వామపక్షాలు రోడ్డెక్కి విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న బంద్‌కు సహకరిస్తున్నట్టు పార్టీలు వెల్లడించగా.. ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితం చేస్తున్నట్లు రవాణ మంత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత నల్ల రిబ్బన్లు ధరించి సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. జనసేన పార్టీ విశాఖ వరకు ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు వెల్లడించింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. బంద్‌ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం సంతోషమని తెలిపారు. సీఎం అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని కోరిన నారాయణ, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక మాట ఢిల్లీలో మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐక్య ఉద్యమాల ద్వారానే విశాఖ స్టీల్‌ను రక్షించుకోగలమని నారాయణ అభిప్రాయపడ్డారు. 2020లో విశాఖ పరిశ్రమలో పేరుకుపోయిన లక్ష టన్నుల ఐరన్ నిల్వల విలువే 7వేల కోట్లు ఉంటుంది. అలాంటిది 1 లక్ష 50వేల కోట్లు విలువచేసే 30వేల ఎకరాలు భూములు, లక్ష టన్నుల నిల్వలు, లక్ష కోట్ల విలువచేసే యంత్ర పరికరాలు, ఐరన్ వోర్ నిల్వలు.. మొత్తం కలిపి 6వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించడం దారుణమైందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బంద్‌ సక్సెస్ ‌తో కేంద్రానికి బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి.