Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో 'చైనా' సెంటిమెంట్.. ఆ చానల్ కు వందల కోట్ల ఆదాయం లాస్?

By:  Tupaki Desk   |   9 Aug 2020 1:30 AM GMT
ఐపీఎల్ లో  చైనా సెంటిమెంట్.. ఆ చానల్ కు వందల కోట్ల ఆదాయం లాస్?
X
కరోనా నేపథ్యంలో ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలకు తెర పడినట్లే. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు.. ఆరోగ్యానికి సంబంధించిన భారీ ఎత్తున తీసుకుంటున్న జాగ్రత్తలతో దుబాయ్ లో ఐపీఎల్ టోర్నీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన టోర్నీలకు భిన్నమైన పరిస్థితుల్లో దీన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొందరి అంచనాల ప్రకారం.. ఇప్పటివరకు మరే.. టోర్నీకి రానంత టీఆర్పీ రేటింగ్ లు ఈసారి ఐపీఎల్ కు వస్తాయని చెబుతున్నారు.

ఇదంతా ఒక వాదన అయితే.. నాణెనికి రెండో వైపు అన్నట్లుగా మరో వాదనను వినిపిస్తున్నారు. భారత్ - చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీకి స్పాన్సర్ గా వ్యవహరించే వివో తనకు తానే స్వచ్చందంగా వెనక్కి తగ్గుతున్నట్లు పేర్కొంది. దీనికి అనుగుణంగా బీసీసీఐ సైతం ఆ సంస్థను తప్పించింది. దీంతో.. ఇప్పుడు కొత్త బ్రాండ్ ఏమవుతుందన్నది ఒక చర్చగా మారింది.

ఇదిలా ఉంటే.. సాధారణంగా ఐపీఎల్ టోర్నీ సమయాన మ్యాచుల్ని ప్రసారం చేసే చానల్ కు ప్రకటనలు ఎక్కువగా చైనా కంపెనీ నుంచే వస్తాయి. వివో ఎపిసోడ్ నేపథ్యంలో.. చైనాకు చెందిన మొబైల్ కంపెనీలు.. తమ బ్రాండ్లను ప్రచారం చేసుకునే విషయంలో వెనక్కి తగ్గొచ్చని చెబుతున్నారు. అదే జరిగితే.. ఐపీఎల్ మ్యాచుల్ని బ్రాడ్ కాస్ట్ చేసే స్టార్ స్పోర్ట్ష్ చానల్ కు తక్కువలో తక్కువ రూ.400 నుంచి రూ.500 కోట్ల మేర నష్టాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ప్రకటనలు ఇచ్చే సంస్థల్లో ఎక్కువగా చైనాకు చెందిన మొబైల్ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. 2019 సీజన్ లో యాడ్స్ రూపంలో స్టార్ స్పోర్ట్స్ చానల్ కు రూ.2100 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో వివో.. ఒప్పో మాత్రమే రూ.240 కోట్ల యాడ్స్ ఇవ్వటం గమనార్హం. ఈ లెక్కన ఈసారి చైనా కంపెనీలన్ని యాడ్స్ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గితే..సదరు చానల్ కు పెద్ద దెబ్బ అని చెబుతున్నారు. మొత్తంగా చైనా ఎఫెక్టుతో స్టార్ స్పోర్ట్స్ చానల్ కు భారీ ఆదాయానికి గండి పడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతుంటే.. టోర్నీ మొదలయ్యాక పరిస్థితుల్లో మార్పు వచ్చే వీలుందన్న వాదన వినిపిస్తోంది. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళలో ఐపీఎల్ కు మించిన వినోదం మరేదీ ఉండదని.. అందుకు వీక్షకులు భారీగా దీనివైపు మళ్లటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. ప్రకటనలు ఇచ్చేందుకు ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున క్యూ కట్టొచ్చొన్న అంచనాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.