Begin typing your search above and press return to search.

తెర‌మీదికి శ్రీబాగ్ ఒప్పందం..ఎందుకు..ఏమిటి..?

By:  Tupaki Desk   |   22 Aug 2019 1:30 AM GMT
తెర‌మీదికి శ్రీబాగ్ ఒప్పందం..ఎందుకు..ఏమిటి..?
X
నేటి నాయ‌కుల‌కు తెలిసినా.. తెలియ‌క పోయినా.. ఉమ్మ‌డి మ‌ద‌రాసు రాష్ట్రంలో రాయ‌ల సీమ‌ - కోస్తా ప్రాంతాల నేత‌ల మ‌ధ్య ఏర్ప‌డిన విభేదాలు - ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌ను రూపుమాపే క్ర‌మంలో కూర్చుని చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన అంశమే శ్రీబాగ్‌ ఒడంబ‌డిక లేదా ఒప్పందం. అప్ప‌టి దేశ‌భ‌క్తుడు కాశీనాధుని నాగేశ్వ‌ర‌రావు పంతులుగారి నివాసం పేరు శ్రీబాగ్‌. ఆయ‌న ఇంట్లో కొంద‌రు పెద్ద‌లు కొన్ని నెల‌ల పాటు భేటీఅయి రెండు ప్రాంతాల్లోనూ ఎలాంటి వివాదాలు - అస‌మాన‌త‌లు లేకుండా ముందుకు సాగాల‌ని, తెలుగు వారు క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని చేసుకున్న ఒప్పందానికే శ్రీబాగ్ ఒప్పంద‌మ‌ని పేరు పెట్టారు. అయితే, ఇది కాల‌క్ర‌మేణా మ‌రుగున ప‌డిపోయింది.

అయితే, ఇప్పుడు ఏపీ రాజ‌ధాని విష‌యంలో త‌లెత్తిన విభేదాలు - అభిప్రాయ భేదాల నేప‌థ్యంలో మ‌రోసారి ఈ విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. 2012లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌కు హైద‌రాబాద్ రాజ‌ధానిగా ఉండిపోయింది. ఇక‌, కొత్త‌గా రాజ‌ధాని ఏర్పాటు ఏపీకి త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శివ‌రామ‌కృష్ణ నేతృత్వంలో రాజ‌ధాని అధ్య‌య‌న క‌మిష‌న్‌ను వేసింది. ఈ క‌మిష‌న్ రాష్ట్రం మొత్తం తిరిగి రాజ‌ధాని ఏర్పాటుపై నివేదిక‌ను ఇచ్చింది. అయితే, రాజ‌ధాని ఏర్పాటును కేంద్రం ఏపీ ప్ర‌భుత్వానికే అప్ప‌గించింది. ఈ నివేదిక‌ను ఫాలో అవుతారో లేదో కూడా ఏపీకే వ‌దిలేసింది.

ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో అంటే 2014లో కొలువుదీరిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నివేదిక‌ను ప‌క్క‌న పెట్టి.. త‌న మ‌న‌సుకు, త‌న పార్టీ నేత‌ల‌కు న‌చ్చిన విధంగా గుంటూరు జిల్లాలో కృష్ణాన‌ది తీరం వెంబ‌డి గ‌తంలో రాజ‌ధానిగా చేసుకుని పాలించిన వారి అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకుని ఇక్క‌డి 12 గ్రామాల‌ను స‌మీక‌రించి అమ‌రావ‌తికి శంకు స్థాప‌న చేశారు. అయితే, ఇదే వివాదానికి కార‌ణ‌మైంది. అస‌లు న‌దీతీర ప్రాంతాల్లో రాజ‌ధాని ఏంటి? అంటూ వైసీపీ ప్ర‌శ్నించింది. దీనికితోడు కొండ‌వీటి వాగు విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. కృష్ణాకు వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా పేర్కొంది. అయినా కూడా బాబు త‌న మాటే నెగ్గించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తిలో నిర్మాణాల‌ను కూడా ప్రారంభించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. రెండు మాసాల కింద‌టే ఏర్ప‌డిన ఈ ప్ర‌భుత్వం ఇప్పుడు ఇక్క‌డ అమ‌రావ‌తి కొన‌సాగించాలా? వ‌ద్దా? అనే మీమాంస‌లో ప‌డింది. అదేస‌మ‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసి న వ్యాఖ్య‌లు మ‌రింత‌గా సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ ప‌రంప‌ర‌లోనే ఇప్పుడు కొత్త‌గా శ్రీబాగ్ ఒప్పందం తెర‌మీదికి వ‌చ్చింది. మద్రాసు రాష్ట్రం నుంచి వేరై రాయలసీమ - కోస్తాంధ్ర ప్రాంతాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ బ్రిటిష్ పాలకుల హయాంలోనే ప్రారంభమైంది.

మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని - తెలుగు ప్రాంతాల ప్రజలకు మద్రాసు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను - విభేదాలను తొలగించడానికి ఓ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అని అంటారు.. 1937లో ఈ ఒప్పందం జరిగింది. కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాల నుంచి తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని - తమకు ప్రత్యేకమైన రక్షణలు కావాలని రాయలసీమ నాయకులు పట్టుబట్టారు. అది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా మారింది. దీంతో రాయలసీమ నాయకులను ఒప్పించడానికి ఆ ఒప్పందం జరిగింది.

ఆంధ్రా బ్యాంకు వ్య‌వ‌స్థాప‌కులు భోగరాజు పట్టాభి సీతారామయ్య - గాడిచర్ల హరిసర్వోత్తమ రావు - హాలహర్వి సీతారామరెడ్డి - కడప కోటిరెడ్డి - కొండా వెంకటప్పయ్య - టి.ఎన్.రామకృష్ణారెడ్డి - మహబూబ్‌ ఆలీ బేగ్‌ - దేశిరాజు హనుమంతరావు - కల్లూరు సుబ్బారావు - దేశపాండ్య సుబ్బారావు - వరదాచారి - పప్పూరి రామాచారి - సుబ్బరామిరెడ్డి - ముళ్ళపూడి పల్లంరాజు వంటివారు 1937 నవంబర్‌ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథు ని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌ లో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఇంటి పేరుమీదనే ఈ చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది.

శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలను చూస్తే.. సీమ‌ - కోస్తా రెండు ప్రాంతాల మధ్య సాంఘిక - సాంస్కృతిక సమానత్వం కోసం విద్యా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురం లో ఒక కేంద్రం ఏర్పాటు చెయ్యాలి. సాగునీటిపారుదల అభివృద్ధి విష‌యంలో వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. శాసనసభ స్థానాలను చూస్తే.. జనాభా ప్రాతిపదికన కాక - ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన చేసారు.

రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు ఆంధ్ర ప్రాంతంలో - హైకోర్టు రాయలసీమలో ఉంటే రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉండాలి. ఈ రెండింటిలో ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. ఆ శ్రీబాగ్ ఒడంబడిక మేరకే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు జిల్లాలో గల అమరావతిని ఎంపిక చేశారు. దీంతో రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఇప్పుడు తాజాగా సీమ వాసులు - నాయ‌కులు శ్రీబాగ్ ఒప్పందాన్ని తెర‌మీదికి తెచ్చారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. పెద్ద తేనె తుట్టె మాత్రం క‌దులుతోంది.