Begin typing your search above and press return to search.

ఉద్యోగ సంఘాల్లో చీలికలా ?

By:  Tupaki Desk   |   7 Dec 2021 5:32 AM GMT
ఉద్యోగ సంఘాల్లో చీలికలా ?
X
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం నుండి ఉద్యోగ సంఘాలు చేయాలని అనుకుంటున్న సమ్మెలో చీలిక వచ్చిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏపీ ఎన్జీవో అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ముందుగా ప్రకటించిన ప్రకారమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరు ఈరోజు నుండి సమ్మెలోకి దిగాలి. సమ్మె ప్రారంభ సూచకంగా కొద్దిరోజులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఉద్యోగాలకు హాజరవ్వాలని డిసైడ్ అయ్యింది.

అయితే పై నేతల ప్రకటనలతో తాము విభేదిస్తున్నట్లు ఏపీ ట్రెజరీ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్టీసీ ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించారు. సమ్మెలో ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ ఉద్యోగులెవరు పాల్గొనటం లేదని వీళ్ళు స్పష్టంగా ప్రకటించారు. పీఆర్సీ తదితర కీలకమైన డిమాండ్ల పరిష్కారం కోసం 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె మొదలు పెట్టనున్నట్లు కొద్దిరోజులుగా ఏపీ ఎన్జీవో నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంలో వీళ్ళతో ట్రెజరీ ఉద్యోగ సంఘం నేతలు విభేదించిన ట్లు సమాచారం. పీఆర్సీని 10 రోజుల్లో ప్రకటిస్తానని తిరుపతి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ గుర్తుచేశారు.

పీఆర్సీ ప్రకటనపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా ఏపీ ఎన్జీవో నేతలు సమ్మె చేయాల్సిందే అని డిసైడ్ చేయటాన్ని తాము అంగీకరించమన్నారు. సీఎం చెప్పిన 10 రోజుల గడువు ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే కదాని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీకి తగ్గట్లుగా ప్రభుత్వం చర్యలు లేకపోతే అప్పుడు ఏమి చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం సబబుగా ఉంటుందని రవికుమార్ సూచించారు. ఉద్యోగుల, అధికారుల సంక్షేమం విషయంలో సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసం తమకున్నట్లు కూడా రవికుమార్ చెప్పారు.

తాజాగా ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి మాటలను బట్టి ఈరోజు నుంచి మొదలయ్యే సమ్మెలో కొందరు ఉద్యోగులు పాల్గొనడం లేదని తేలిపోయింది. అంటే దీనర్ధం ఏమిటంటే సమ్మె చేసే విషయంలో ఉద్యోగ సంఘాల్లోనే చీలిక వచ్చిందని. మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదా నిలబెట్టే శక్తి తమకుందని తాను చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలను బండి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీలను అధికారంలోకి తీసుకొస్తామని, లేదా ఓడగొడతామని తాను ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదని బండి ఇపుడు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. తాను అనని వ్యాఖ్యలను అన్నట్లుగా ఒ సెక్షన్ మీడియా కావాలనే ప్రచారం చేస్తోందని మండిపోయారు.

ఏదేమైనా ఉద్యోగ సంఘాల తాజా వైఖరి చూసిన తర్వాత సమ్మె చేసే విషయంలో చీలికలు వచ్చినట్లు అర్ధమైపోతోంది. ఒకసారి బాహాటంగా ట్రెజరీ ఉద్యోగులు సమ్మెకు వ్యతిరేకమని చెప్పిన తర్వాత మిగిలిన ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఇలాంటి ఆలోచన వచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని ఎంఎల్సీ, మాజీ ఉద్యోగ సంఘాల నేత వెన్నపూస గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. సమ్మె చేయటం అన్నది చివరి అస్త్రంగా ఉండాలని చెప్పారు. 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించిన తర్వాత అప్పటివరకు వెయిట్ చేస్తే బాగుంటుందని సూచించారు.