Begin typing your search above and press return to search.

లాయ‌ర్ల‌కు నారా లోకేష్ గుడ్ న్యూస్‌.. అప్పుడే నిర్ణ‌యించుకున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   3 Jun 2023 5:00 AM GMT
లాయ‌ర్ల‌కు నారా లోకేష్ గుడ్ న్యూస్‌.. అప్పుడే నిర్ణ‌యించుకున్నార‌ట‌!
X
రాష్ట్రంలోని లాయర్లకు టీడీపీ యువ‌నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ శుభవార్త చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. కొత్త భవనాలు, జూనియర్ లాయర్ల కోసం కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి విడిది కేంద్రం వద్ద వివిధ రంగాల నిపుణులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో భాగంగా జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొద్దుటూరులో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి..?, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లాయర్లు, డాక్టర్లకు జగన్ ప్రభుత్వం ఏ విధంగా అనాయ్యాలు చేస్తోంది..?, న్యాయవాదులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది..? వంటి తదితర అంశాలను నిపుణులు లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

జగన్ మోహన్ రెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వమని.. జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులే అని లోకేష్ విమ‌ర్శించారు. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందులకి ఏం చేశాడో జగన్ చెప్పగలడా..? అని లోకేశ్ ప్రశ్నించారు. ఉమ్మడి కడప జిల్లాలోని ప్రజలు 10కి 10 సీట్లు ఇస్తే జగన్ చేసింది ఏంటి..?, దొంగ చేతికి తాళం ఇస్తే ఏం జరిగింది..? అందరూ దోపిడీకి గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ‌త అనుభ‌వాన్ని వెల్ల‌డించిన లోకేష్‌ ''నేను సాక్షిపై పరువు నష్టం దావా కేసు వేశాను. ఆ సమయంలో వైజాగ్ కోర్టుకు వెళ్లాను. ఆ కోర్టుల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అప్పుడు అర్థమైంది. ఆ రోజే నిర్ణయించుకున్నా న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.

మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. కొత్త భవనాలు, జూనియర్ లాయర్ల కోసం కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం. అడ్వకేట్లకు ప్రత్యేక ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకురావడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అడ్వకేట్లకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం. ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం`` అని లోకేష్ హామీల వ‌ర‌ద పారించారు.