Begin typing your search above and press return to search.

తెగిస్తున్న సోనియమ్మ.. టైమింగ్ విషయంలో మార్పు రావాల్సిందే

By:  Tupaki Desk   |   19 July 2021 4:01 AM GMT
తెగిస్తున్న సోనియమ్మ.. టైమింగ్ విషయంలో మార్పు రావాల్సిందే
X
అనూహ్య నిర్ణయాలు తీసుకోవటానికి కాంగ్రెస్ అధినాయకత్వం అస్సలు వెనుకాడటం లేదు. తెగించేసి మరీ నిర్ణయాలు తీసుకోవటం ఈ మధ్యన కాంగ్రెస్ లో కనిపిస్తున్న కొత్త మార్పు. కాకుంటే.. టైమింగ్ విషయంలోనే ఆ పార్టీ తీరు మరింత మారాల్సిన అవసరం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే వేళలో.. కాలానికి తగ్గట్లు నిర్ణయాల్ని తీసుకుంటున్నప్పటికీ.. దాన్ని తీసుకునేందుకు పడుతున్న మల్లగుల్లాలు పార్టీకి డ్యామేజింగ్ గా మారుతున్నాయి. తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ సిద్ధూను నియమిస్తూ అధినాయకత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలా పవర్ లో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు.. సిద్ధూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. సిద్ధూ విషయంలో ఆయన ఏమాత్రం సానుకూలత వ్యక్తం చేయరు. బహిరంగంగానే వ్యతిరేకిస్తుంటారు. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సిన వేళలో.. పీసీసీ చీఫ్ పదవిని సిద్ధూకు కట్టబెట్టటం ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెగించి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అధినేతకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ డెసిషన్ సాహసోపేతమైనదనే చెప్పాలి.

ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం.. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రేవంత్ కాంగ్రెస్ వాడు కాదు కదా? టీడీపీ నుంచి వచ్చాడు కదా? సీనియర్ కూడా కాదు కదా? ప్రజల్లో విశ్వసనీయత కూడా అంతంత మాత్రమే కదా? అలాంటోడికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడతారా? కాంగ్రెస్ అధినాయకత్వానికి ఈ మధ్యన ఏమైంది? రేవంత్ తప్పించి మరెవరూ దొరకలేదా? లాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తాయి. కానీ.. తరచి చూస్తే.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించటమే కాదు.. సోనియాగాంధీ అనే వ్యక్తే లేకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనే స్వప్నం సాకారం అయ్యేదే కాదు. అలాంటి కలను రియాల్టీలోకి తీసుకొచ్చినప్పటికీ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఎలా ఉందన్న విషయం తెలిసిందే.

దీనికి కారణం.. సరైన సమయంలో సరైన నాయకుడి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించకపోవటమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోయింది లేదు. కానీ.. పార్టీలో ఉన్ననేతల మధ్య కొరవడిన సమన్వయం.. వారిని ఒకటిగా చేసి నడిపించే చాకచక్యం లేకపోవటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా రేవంత్ నియామకం అన్నట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవటం.. అందుకు తగ్గట్లే.. సరికొత్త ఊపు.. ఉత్సాహం పార్టీలో వెల్లివిరుస్తున్న వైనం గడిచిన కొద్దిరోజులుగా చూస్తున్నదే.

కాకుంటే.. రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయటానికి తీసుకున్న టైం మీదన చాలామందికి పార్టీ అధినాయకత్వంపై కంప్లైంట్లు చాలానే ఉన్నాయి. కీలక నిర్ణయాల్ని నాన్చకుండా.. ఫటాఫట్ అన్నట్లుగా తేల్చటం ద్వారా మరింత రాజకీయ ప్రయోజనం పొందొచ్చన్న మాట వినిపిస్తోంది. తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని మాజీ క్రికెటర్ కు కట్టబెట్టే విషయంలో సాగించిన మంతనాలు.. తీసుకున్న సమయం పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న విమర్శ వినిపిస్తోంది. ఇంత రచ్చ చేసుకునే కన్నా.. తమ పార్టీ సీఎంను.

. సిద్ధూను ఒక చోట కూర్చోబెట్టి.. పార్టీ అవసరాల్ని.. ఇద్దరు నేతలు కలిసి ఉండటం ద్వారా పార్టీ కోరుకుంటున్నదేమిటన్న విషయాల్ని వివరించటం ద్వారా.. అనవసరమైన న్యూసెన్సును తగ్గించుకునే వీలుంది.

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొద్దిరోజులుగా నలుగుతున్న పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని సిద్ధూకు అప్పజెబుతూ అధికారికంగా ఒక లేఖను విడుదల చేయటమే కాదు.. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో లేఖను విడుదల చేశారు. సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవిని అప్పజెబుతూ.. మరో నలుగుర్ని (సంగత్ సింగ్ గిల్జియన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, ఖుల్జీత్ సింగ్ నగ్రా) వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిద్దూకు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు అధిష్టానం కసరత్తు చేసే వేళలో.. సీఎం అమరీందర్ సింగ్ .. ఆయన వర్గీయులు తెగ ప్రయత్నాలు చేసినప్పటికీ సోనియాగాంధీ మాత్రం చివరకు సిద్ధూకే పగ్గాలు అప్పజెబుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో రాహుల్ కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు.