Begin typing your search above and press return to search.

అయ్యన్న రేంజిలో కొడుకు ....?

By:  Tupaki Desk   |   4 Dec 2021 11:36 AM GMT
అయ్యన్న రేంజిలో కొడుకు ....?
X
విశాఖ జిల్లా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. పెళ్ళి కాకుండానే ఎమ్మెల్యేగా నెగ్గిన పడుచు ప్రాయం ఆయనది. ఒక విధంగా ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసినది స్వర్గీయ నందమూరి తారక రామారావు. అయ్యన్న తాత లచ్చాపాత్రుడి కోసం ఎన్టీయార్ పిలిపిస్తే చివరికి అయ్యన్నకు రాజకీయ అదృష్టం పట్టింది. అలా ఈ రోజు వరకూ నాటౌట్ గా అయ్యన్న జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే రాజకీయంగా రిటైర్ కావాలని ఉందని అయ్యన్న పలు మార్లు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలలోనే తాను తప్పుకుంటానని ఆయన చంద్రబాబుకు చెప్పారు. అయితే ఆ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో అయ్యన్ననే బరిలో నిలవాలని బాబు కోరడం జరింది. సరే పార్టీ మాట మేరకు అయ్యన్నపాత్రుడు పోటీ చేశారు. చివరికి భారీ తేడాతో వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ చేతిలో ఓడారు.

ఇక ఈ రెండున్నరేళ్లలో అనేక రాజకీయ పరిణామాలు కూడా నర్శీపట్నంలో చోటు చేసుకున్నాయి. అయ్యన్న సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడు వైసీపీ గూటికి వెళ్ళిపోయారు. ఆయన సతీమణి అనితకు డీసీసీబీ చైర్ పర్సన్ పదవిని జగన్ ఇచ్చారు. దాంతో అధికార దర్పం తమ్ముడి ఇంట్లో కనిపిస్తోంది. ఇంకో వైపు తమ్ముడుతో పాటు వైసీపీ ఎమ్మెల్యే, ఒకనాడు తన వద్దనే శిష్యరికం చేసిన ఉమా శంకర్ దూకుడు రాజకీయాలతో అయ్యన్నకు తెగ ఇరకాటంగా ఉంది.

ఇంకోవైపు చూసుకుంటే సొంత కుమారుడు విజయ్ పాత్రుడు తండ్రికి సరిగ్గా అందుకు రాలేదనే అంటున్నారు. అయ్యన్నలోని ఫైర్ ఆయన రాజకీయ చతురత కుమారుడికి రాలేదని సొంత పార్టీలోనే కామెంట్స్ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్నపాత్రుడికి 67 ఏళ్ళు నిండుతాయి. ఆయన రాజకీయాల్లో ఉండను అంటున్నారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటాను అని చెబుతున్నారు. అయితే క్యాడర్ మాత్రం అయ్యన్నే పోటీ చేయాలని ఆయన ఉంటేనే వైసీఎపీ స్పీడ్ కి అడ్డుకట్ట వేయగలుగుతామని అంటున్నారు.

అయితే తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న అయ్యన్న ఆరాటం నెరవేరుతుందా లేదా అన్నది తెలియడంలేదు. నర్శీపట్నంలో ఒకపుడు టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది. అయితే ఇపుడు మాత్రం వైసీపీ బాగానే పుంజుకుంది. ఇక సొంత తమ్ముడే అయ్యన్నకు ఎదురు నిలిచిన వేళ విజయ్ పాత్రుడు పోటీకి దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, చంద్రబాబు కూడా అయ్యన్న వైపే చూస్తున్నారని అంటున్నారు. ఆయన కాకపోతే వేరే ఇతర నాయకుడికి అయినా టికెట్ ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరి అయ్యన్న రేంజికి కుమారుడు ఎదిగితేనే టీడీపీకి, అయ్యన్నకు మేలు జరుగుతుంది అంటున్నారు. మరి విజయ్ రానున్న రెండేళ్ల కాలంలో తన సత్తా చాటుతారా. చూడాలి.