Begin typing your search above and press return to search.

లోన్ మార‌టోరియం కేసు : కేంద్రానికి సుప్రీం మరో అవకాశం, అక్టోబ‌ర్ 5కు వాయిదా !

By:  Tupaki Desk   |   28 Sep 2020 3:30 PM GMT
లోన్ మార‌టోరియం కేసు : కేంద్రానికి సుప్రీం మరో అవకాశం, అక్టోబ‌ర్ 5కు వాయిదా !
X
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సామాన్యులకి ఊరట కలిపిస్తూ తీసుకొచ్చిన లోన్ మారటోరియం గడువు ఆగస్టు 31 తో ముగిసింది. అయితే , మార‌టోరియం కాలంలో వ‌డ్డీ మాఫీ చేయాలంటూ కొంతమంది సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుసార్లు వాదనలు జరగగా తాజాగా నేడు మరోసారి ఈ కేసు విచారణకి వచ్చింది. గ‌త విచార‌ణ‌లో కోర్టు కోరిన వివ‌రాల‌ను సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఇవ్వ‌లేపోయారు. వివ‌రాల స‌మ‌ర్ప‌ణ‌కు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు విన్న‌వించారు. మార‌టోరియంపై కేంద్రం, ఆర్బీఐ వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా తెల‌పాల‌ని గ‌తంలోనే సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ను జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ ధ‌ర్మాస‌నం అడిగింది. కేంద్రం నిర్ణ‌యం తీసుకునే ప్ర‌క్రియ తుది ద‌శ‌లో ఉంద‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కోర్టుకు తెలిపారు. అలాగే కేంద్రానికి మ‌రికొంచెం గ‌డువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

అయితే , గ‌తంలో ఇచ్చిన‌ మ‌ధ్యంత‌ర ఆదేశాలు కొనసాగుతాయ‌ని న్యాయస్థానం స్పష్టం చేసింది. లోన్ మార‌టోరియం కాలంలో వ‌డ్డీమాఫీ అంశంపై త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 5వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మారటోరియం కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించే అవకాశమున్నదని కేంద్రం తరుఫున అటర్నీ జనరల్ గ‌తంలో కోర్టుకు తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే తరువాత విచారణలో బ్యాంకులకు నష్టం కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకోబోదని అన్నారు. దీంతో వడ్డీపై వడ్డీ అంశంలో కేంద్రం ఏం చెప్పదలచుకుందో స్పష్టంగా చెప్పేవరకు అంచనా వేయడం కష్టంగా మారుతుంది. అలాగే తగిన ఆదేశాలు జారీ చేసేంత వరకు మారటోరియం వినియోగించుకున్న రుణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మారటోరియం గడువు ఆగస్టు 31తో ముగిసిపోయింది. దీనితో ఈ మారటోరియం ఉపయోగించుకున్న వారు సుప్రీం తీర్పు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.