Begin typing your search above and press return to search.

అచ్చం 'పుష్ప'లో మాదిరిగానే స్మగ్లింగ్‌ ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   16 May 2022 9:51 AM GMT
అచ్చం పుష్పలో మాదిరిగానే స్మగ్లింగ్‌ ఎక్కడంటే?
X
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలయిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు స్మగ్లర్లు పుష్ప సినిమాను చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం దుంగలను మిల్క్‌ ట్యాంకు లారీల్లో తరలిస్తూ పోలీసులను ఏమారుస్తూ ఉంటాడు. లారీ ట్యాంకులో మొత్తం పాలు, ట్యాంకర్‌ కింద భాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎర్రచందనం తరలిస్తూ ఉంటాడు.

ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో పలువురు స్మగ్లర్లకు స్ఫూర్తిగా మారింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో పాల ట్యాంకులో ఎర్ర చందనం దుంగలను తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. పుష్ప సినిమా చూసే తాము ఇలా చేశామని పేర్కొనడంతో పోలీసులు బిత్తరపోయారు.

పుష్ప సినిమాలోనే ఒక సీన్‌లో లారీలో ఎర్రచందనం తరలిస్తున్న హీరో అల్లు అర్జున్‌ని పోలీసులు వెంటాడతారు. దీంతో హీరో వారిని తప్పించుకుని లారీని ఒక బావిలోకి తోసేస్తాడు. తర్వాత పోలీసులు వెళ్లిపోయాక లారీని, ఎర్రచందనాన్ని బయటకు తీయిస్తాడు.

ఇప్పుడు ఇదే కోవలో తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలోనూ పుష్ప సినిమా సీన్‌ రిపీట్‌ అయ్యింది. మారేడుమిల్లి వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాల చెకింగ్‌ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ స్కార్పియో కారు పోలీసులను ఆపకుండా ముందుకు దూసుకుపోయింది. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు ఆ కారును వెంటాడారు. ఇలా దాదాపు 15 కి.మీ దూరం ఆ కారును వెంబడించారు.

దీంతో ఆ కారులో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారుని భూపతిపాలెం రిజర్వాయిర్‌లోకి తోసేశారు. దీంతో పోలీసులు జేసీబీని తెప్పించి కారును రిజర్వాయిర్‌ నుంచి వెలికితీయించారు. మొత్తం 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

కాగా, పుష్ప సినిమా షూటింగ్‌ అత్యధిక భాగం మారేడుమిల్లిలోనే జరగడం విశేషం. ఇప్పుడు తాజా గంజాయి స్మగ్లింగ్‌ ఘటన కూడా మారేడుమిల్లిలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

పుష్ప సినిమా విడుదలయినప్పుడే పలువురు పోలీసు అధికారులు ఈ సినిమా మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందని నిలదీసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు కూడా పుష్ప సినిమాపై మండిపడ్డ సంగతి విదితమే.