Begin typing your search above and press return to search.

వయసుతో సంబంధం లేదు.. కరోనాకు చిన్నారులు బలి

By:  Tupaki Desk   |   1 April 2020 12:30 PM GMT
వయసుతో సంబంధం లేదు.. కరోనాకు చిన్నారులు బలి
X
కరోనా వైరస్‌ సోకితే వృద్ధులకు ప్రాణాంతకం కానీ 50 ఏళ్లలోపు వారికి ప్రమాదం లేదని వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఇన్నాళ్లు ప్రకటించారు. ముఖ్యంగా నడి వయసు యువతీయువకులకు ఈ వైరస్‌ సోకితే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు. కానీ వాస్తవంగా పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ వైరస్‌ బారిన గతంలోనే భారతదేశంలో 38 ఏళ్ల యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌లో 13 ఏళ్ల బాలుడు, బెల్జియంలో 12 ఏళ్ల బాలిక ఈ కరోనా వైరస్‌ బారిన పడి మృతిచెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వైరస్‌ బలీయంగా మారి తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారిని కూడా కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావితం చేసి దాన్ని ఓడిస్తుండడంతో ఈ వైరస్‌ను శరీరం తట్టుకోలేక మృతిచెందుతున్నారని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వైరస్‌ రోజురోజుకు బలీయంగా మారుతోంది.

లండన్‌లోని కింగ్స్‌ కళాశాల ఆస్పత్రిలో కొన్ని రోజుల కిందట ఓ బాలుడు చేరాడు. ఆ బాలుడికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. ఈ వైరస్‌ వ్యాపించడంతో అతడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అతడికి శ్వాస అందించారు. అయితే ఈ క్రమంలో ఆ బాలుడు కోమాలోకి వెళ్లాడు. తర్వాత మార్చి 31వ తేదీన మంగళవారం సాయంత్రం ఆ బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇక బెల్జియంలో కూడా ఓ బాలిక కరోనా వైరస్‌కు బలైంది. ప్రస్తుతం బెల్జియంలో కరోనా వైరస్‌ తాండవిస్తోంది. ఆ వైరస్‌ కేసులు భారీగా పెరుగుతుండగా మృతుల సంఖ్య కూడా పెద్దసంఖ్యలో ఉంది. అయితే 12 ఏళ్ల కరోనా బారిన మృతిచెందడంతో ఆ దేశ ప్రజలు షాక్‌కు గురయ్యారు. చిన్నపిల్ల వైరస్‌ బారిన పడి మృతిచెందడంతో ఆ దేశంలో తొలి కేసుగా పేర్కొంటున్నారు. ఈ బాలిక మృతితో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను అప్రమత్తంగా ఉండేలా చూసుకుంటున్నారు. వారిపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ విధంగా కరోనా వైరస్‌ బారిన పడిన నడి వయసుతో పాటు చిన్నారులు మృతిచెందడంతో వైద్యులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆ వైరస్‌ను తప్పుగా అంచనా వేశామా? లేదా ఆ వైరస్‌ రోజురోజుకు బలీయంగా తయారవుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కరోనా వైరస్‌పై మరోసారి సమగ్రంగా పరిశోధనలు చేసేందుకు పరిశోధకులు, వైద్యులు సిద్ధమయ్యారు.