Begin typing your search above and press return to search.

సింధు తండ్రి స్టార్ ప్లేయర్.. అర్జున అవార్డు గ్ర‌హీత‌.. ఏ క్రీడ‌లో తెలుసా?

By:  Tupaki Desk   |   4 Aug 2021 12:30 AM GMT
సింధు తండ్రి స్టార్ ప్లేయర్.. అర్జున అవార్డు గ్ర‌హీత‌.. ఏ క్రీడ‌లో తెలుసా?
X
ఒలింపిక్స్.. నాలుగేళ్లకు ఒక‌సారి జ‌రిగే ప్ర‌పంచ క్రీడా సంరంభం. యావ‌త్ దేశాల‌న్నీ పాల్గొనే ఈ క్రీడ‌ల్లో.. ఒక్క ప‌త‌క‌మైనా గెల‌వాల‌నేది స‌గ‌టు క్రీడాకారుల‌ స్వ‌ప్నం. కానీ.. ఎంతో మందికి అది అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతుంది. మొత్తం ప్ర‌పంచాన్ని వెన‌క్కు నెట్టి విజ‌యం సాధించ‌డం అనేది ఎంత‌టి క‌ఠిన‌మైన‌దో అవ‌గాహ‌న ఉన్న‌వారికి మాత్ర‌మే అర్థ‌మ‌వుతుంది. అయితే.. ఒక్క‌సారి ప‌త‌కం సాధించ‌డం అంటేనే క‌ష్ట‌సాధ్యం. అలాంటిది.. మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత పోటీల‌కు స‌న్న‌ద్ధం కావాలంటే.. అది మ‌రింత క‌ఠిన‌త‌రం. ఫిట్ నెస్ ను కాపాడుకోవాల్సి ఉంటుంది. పెరిగిన వ‌య‌సును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటిక‌న్నా ముఖ్యంగా.. ఈ నాలుగేళ్ల‌లో ఎంతో మంది కొత్త క్రీడాకారులు రంగంలోకి వ‌చ్చేస్తారు. ఇలాంటి అడ్డంకుల‌ను అధిగ‌మించి రెండోసారి ఒలింపిక్స్ లో ప‌త‌కం సాధించ‌డం అనేది ఖ‌చ్చితంగా అద్వితీయ‌మైన ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. దాన్ని మ‌రోసారి చాటి చెప్పి, స‌గ‌ర్వంగా రెండో సారి ప‌త‌కాన్ని మెడ‌లో వేసుకుంది సింధు.

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భార‌త‌ మహిళా క్రీడాకారిణిగా స్టార్ షట్లర్ పీవీ సింధు రికార్డులకు ఎక్కింది. నాలుగేళ్ల క్రితం రియోలో సిల్వ‌ర్ (ర‌జ‌త‌) మెడ‌ల్ గెలిచి స‌త్తా చాటిన‌ సింధు.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ (కాంస్య‌) పతకం కొల్లగొట్టింది. అయితే.. గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల నుంచి త‌న ఫిట్ నెస్ తోపాటు ఫామ్ ను కాపాడుకుంటూ వ‌చ్చిన సింధూ ఎన్నో అద్వితీయ‌మైన విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. ఎన్నో సంవ‌త్స‌రాల‌ నుంచి నిలకడగా రాణిస్తోంది.

అయితే.. సింధు క్రీడాకారిణిగా ఎలా మారింది? అంటే.. ఆమె ఇంటి వాతావ‌ర‌ణ‌మే అటువైపుగా మ‌ళ్లించింద‌ని చెప్పొచ్చు. అవును.. సింధు తండ్రి ర‌మ‌ణ కూడా ఫేమ‌స్ క్రీడాకారుడే. ఆయ‌న ఏకంగా అర్జున‌ అవార్డును గెలుచుకున్నారంటే.. ఆయ‌న క్రీడాప్ర‌తిభా పాట‌వం ఎలాంటిద‌ని అంచ‌నా వేయొచ్చు. ఆయ‌న ప్ర‌ముఖ వాలీబాల్ క్రీడాకారుడు. పీవీ రమణ వాలీబాల్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభ‌వం ఉంది. ఆయ‌న ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌కు గానూ 2000 సంవ‌త్స‌రంలో కేంద్రం అర్జున అవార్డుతో సత్కరించింది. ఆ విధంగా.. ఇంట్లోనే క్రీడా వాతావ‌ర‌ణ ఉండ‌డం కూడా.. సింధు క్రీడాకారిణి కావ‌డానికి కార‌ణ‌మైంద‌ని చెప్పొచ్చు.

బ్యాడ్మింట‌న్ రాకెట్ పట్టిన సింధు.. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వ‌ర్యంలో కీ ప్లేయ‌ర్ గా ఎదిగింది. రియో ఒలింపిక్స్ లో పాల్గొన‌డం ద్వారా.. సింధు స‌త్తా ఏంట‌న్న‌ది ప్ర‌పంచానికి తెలిసి వ‌చ్చింది. ఆ త‌ర్వాత నుంచి ఆమె అద్భుత‌మైన ఫామ్ కొన‌సాగిస్తూ.. ఎన్నో విజ‌యాలు అందుకుంది. 2019లో మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా అవతరించింది సింధు. ఆ జోరును కొన‌సాగిస్తూనే.. టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లిన సింధు.. మ‌రోసారి దుమ్ములేపింది. రెండో ప‌త‌కాన్ని అందుకుంది.

సింధు ట్రాక్ రికార్డును ప‌రిశీలిస్తే.. ఎన్నో విజ‌యాలు క‌నిపిస్తాయి. 2009 నుంచి మొద‌లైన విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో అవార్డుల‌ను సొంతం చేసుకుంది సింధు. క్రీడాకారంగంలో ఆమె చేసిన సేవ‌ల‌కు గుర్తుగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు మార్లు ప‌లు అవార్డుల‌తో గౌర‌వించింది. 2013లో అర్జున అవార్డు అందుకున్న సింధు.. 2015లో ప్ర‌తిష్టాత్మ‌క‌ పద్మశ్రీ అవార్డును సొతం చేసుకుంది. 2016 లో క్రీడారంగంలోనే అత్యున్న‌త పుర‌స్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. ఇక 2020లో మూడో భార‌త అత్యున్న‌త పుర‌స్కారం పద్మభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మ‌రోసారి ఒలింపిక్ ప‌త‌కం గెలిచి.. మువ్వ‌న్నెల జెండాను స‌గ‌ర్వంగా ఎగ‌రేసింది.