Begin typing your search above and press return to search.

సంతకం ఫోర్జరీ .. 40 లక్షలు కాజేసిన సాబూ కార్స్‌ డైరెక్టర్‌ , ఎలా బయటపడిందంటే

By:  Tupaki Desk   |   26 Nov 2021 1:30 AM GMT
సంతకం ఫోర్జరీ .. 40 లక్షలు కాజేసిన సాబూ కార్స్‌ డైరెక్టర్‌ , ఎలా బయటపడిందంటే
X
చీటింగ్‌ కేసులో సాబూ కార్స్‌ సంస్థ వర్కింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ సాబూను కార్ఖానా పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రవీందర్‌ కథనం ప్రకారం సికింద్రాబాద్‌లోని సిఖ్‌విలేజ్‌లో నివసించే కె. వీరేందర్‌రెడ్డి కూడా మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. జూలై నెల నుంచి రెండు కార్లకు సంబంధించిన రుణాలు కట్టడం లేదని, ఏఎస్‌ రావునగర్‌కు చెందిన సుందరం ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు ఇంటికి రావడంతో షాక్‌ కు గురయ్యాడు.

తాను ఎటువంటి కారు లోన్లు తీసుకోలేదని, అతను సదరు ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులకు తెలిపాడు. మారేడుపల్లికి చెందిన ప్రశాంత్‌ సాబూ అనే వ్యాపారి మీ గ్యారంటి సంతకంతో రెండు కార్ల లోన్లు రూ. 40లక్షలు తీసుకున్నాడని సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించి వీరేందర్‌రెడ్డి సంతకాలతో కూడిన లోన్‌ డాక్యుమెంట్లను చూపించారు. ఈ విషయంలో తాను మోసపోయినట్లు గ్రహించిన వీరేందర్‌రెడ్డి ఈ నెల 16వ తేదీన తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌లో ప్రశాంత్‌ సాబూపై ఫిర్యాదు చేశాడు.

వీరేందర్‌రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. కేవీ రెడ్డికి సంబంధించిన పలు ఆధారాలను సుందరం ఫైనాన్స్‌ సంస్థకు అందించి, అతని సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి రెండు కార్లపై లోన్‌ను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్‌ సాబూకు జీఎస్‌ఎం కుమార్‌ అనే వ్యక్తి సహకరించాడని పోలీసులు తెలిపారు. రుణం తీసుకున్నా కార్లు కొనలేదని, ఫైనాస్స్ కంపెనీ కూడా దీని గురించి పట్టించుకోలేదని గుర్తించారు. అనంతరం కార్ఖానా పోలలీసులు నిందితుడు ప్రశాంత్‌ సాబూను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్‌ తెలిపారు. కాగా ప్రశాంత్‌ సాబూ ఇప్పటికే అనేకమందిని ఇదే తరహాలో మోసం చేశాడని, అమాయకులను బాధితులుగా మార్చాడనే ఆరోపణలు ఉన్నాయి.